Chillakallu Police : ‘వర్రా’ మెడనొప్పి హంగామా!
ABN , Publish Date - Mar 12 , 2025 | 06:43 AM
వైసీపీ సోషల్ మీడియాలో బూతులు పోస్టు చేసి కడప జైల్లో ఉన్న జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రరెడ్డిని...

కడప జైలు నుంచి వచ్చేందుకు ససేమిరా
వైద్య పరీక్షల్లో నొప్పి కేవలం డ్రామా అని తేలడంతో ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లుకు తరలింపు
కడప/జగ్గయ్యపేట, మార్చి 11(ఆంధ్రజ్యోతి): వైసీపీ సోషల్ మీడియాలో బూతులు పోస్టు చేసి కడప జైల్లో ఉన్న జగన్ సతీమణి భారతి పీఏ వర్రా రవీంద్రరెడ్డిని ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీసులు పీటీ వారెంట్పై అదుపులోకి తీసుకున్నారు. అయితే.. పోలీసులను చూసిన వర్రా.. తనకు మెడనొప్పిగా ఉందని, అక్కడికి రాలేనని డ్రామాలకు తెరదీశారు. దీంతో పోలీసులు రిమ్స్లో వైద్య పరీక్షలు చేయించి, ఎలాంటి ఇబ్బందులు లేవని, మెడనొప్పి కేవలం డ్రామానేనని గుర్తించి తమ వెంట ఎన్టీఆర్ జిల్లాకు తరలించారు. వర్రా రెండు నెలలుగా కడప సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్నారు. అతనిపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. చిల్లకల్లులో కూడా కేసు నమోదైంది. దీంతో వర్రాను జగ్గయ్యపేట మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి పీటీ వారెంట్పై చిల్లకల్లు ఎస్సై టి. సూర్యశ్రీనివాస్ నేతృత్వంలో పోలీసులు మంగళవారం కడపకు వచ్చారు.
కాగా, కడప సెంట్రల్ జైలులో వర్రాకి వైసీపీ నేతల సహకారంతో కొందరు అధికారులు సకల సౌకర్యాలు కల్పించినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాకు వెళితే అక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న ఆలోచనతో తనకు మెడనొప్పిగా ఉందని తాను రాలేనని డ్రామాకు తెరదీశారు.