PVN Madhav: వాజపేయి-బాబు మైత్రితోనే ఉమ్మడి రాష్ట్రాభివృద్ధి
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:14 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మాజీ ప్రధాని వాజపేయి ముద్ర మరువలేనిదని.. నాడు ప్రధాని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాజపేయి, చంద్రబాబు మైత్రితోనే ఏపీలో...
మాజీ ప్రధాని విగ్రహావిష్కరణలో మాధవ్
హాజరైన మంత్రులు పార్థసారథి, గొట్టిపాటి, అనగాని
బాపట్ల, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మాజీ ప్రధాని వాజపేయి ముద్ర మరువలేనిదని.. నాడు ప్రధాని, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వాజపేయి, చంద్రబాబు మైత్రితోనే ఏపీలో అనేక అభివృద్ధి పనులు పురుడుపోసుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. అటల్, మోదీ సుపరిపాలన బస్సు యాత్ర మంగళవారం బాపట్లకు చేరుకోగా ఇంజనీరింగ్ కళాశాల సెంటర్లో ఏర్పాటు చేసిన వాజపేయి కాంస్య విగ్రహాన్ని మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్లతో కలిసి మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్రతో నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించిన సమయంలో ఆయనకు అండగా వాజపేయి నిలిచారని గుర్తు చేశారు. జాతీయ రహదారుల కనెక్టివిటీతో పాటు పనికి ఆహార పథకం, గ్యాస్, టెలికాం రంగాల్లో సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని వాజపేయి అని మాధవ్ కొనియాడారు. ఈ కార్యక్రమానికి మంత్రు లు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్లతో పాటు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హాజరయ్యారు.