Bus Accident: రెండు ప్రైవేటు బస్సులు ఢీ
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:34 AM
నంద్యాల జిల్లాలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 27 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి..
ముగ్గురు మృతి.. 27 మందికి గాయాలు,
ఆళ్లగడ్డ సమీపంలో ఘటన
నంద్యాల, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో రెండు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 27 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. శ్రీకృష్ణ ట్రావెల్స్, జగన్ ట్రావెల్స్ బస్సులు గురువారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాదుకు 49 మంది ప్రయాణికులతో బయల్దేరాయి. శుక్రవారం తెల్లవారుజామున 3.30 గంటలకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ముందు వెళ్తున్న జగన్ ట్రావెల్స్ బస్సును.. వెనుక వెళ్తున్న శ్రీ కృష్ణ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అనకాపల్లి జిల్లా నాతవరం మండలం గునుపుడి గ్రామానికి చెందిన కుసరాజు(25), రాజమహేంద్రవరానికి చెందిన వెంకట సాయి(22), హైదరాబాద్లోని సరూర్ నగర్కు చెందిన అనంత గౌతమ్(23) అక్కడికక్కడే మృతి చెందారు. 27 మంది గాయపడ్డారు.