Share News

AP Judiciary: హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్‌ కుమార్‌

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:14 AM

ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది గేదెల తుహిన్‌ కుమార్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఆయన నియామకాన్ని...

AP Judiciary: హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా తుహిన్‌ కుమార్‌

  • నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర

అమరావతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా న్యాయవాది గేదెల తుహిన్‌ కుమార్‌ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో ఆయన నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయశాఖ శుక్రవారం నోటిఫికేషన్‌ జారీచేసింది. సీజేఐ బీఆర్‌.గవాయ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం గత నెల 2న సమావేశమై.. తుహిన్‌ కుమార్‌ను ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమించాలని కేంద్రానికి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర హైకోర్టులో 37 మంది జడ్జీల నియామకానికి ఆమోదం ఉంది. అదనపు న్యాయమూర్తులతో కలుపుకొని ప్రస్తుతం 29 మంది న్యాయమూర్తులు ఉన్నారు. తుహిన్‌ నియామకంతో ఈ సంఖ్య 30కి చేరనుంది.

1994లో హైకోర్టు న్యాయవాదిగా ఎన్‌రోల్‌

తుహిన్‌ కుమార్‌ స్వగ్రామం పార్వతీపురం మన్యం జిల్లా వీరగట్టం మండలం కత్తులకవిటి గ్రామం. తల్లిదండ్రులు సరోజినినాయుడు, కృష్ణమూర్తినాయుడు. విశాఖలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేశారు. లాసెట్‌లో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు పొందిన ఆయన విశాఖ ఎన్‌బీఎం న్యాయ కళాశాల నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1994లో హైకోర్టు న్యాయవాదిగా నమోదయ్యారు. విశాఖలో జూనియర్‌ న్యాయవాదిగా పనిచేశారు. ఏడాదిన్నర తర్వాత ప్రాక్టీస్‌ను ఏపీ హైకోర్టుకు మార్చారు. 2000-2004 మధ్య ప్రభుత్వ సహాయ న్యాయవాది(ఏజీపీ)గా పనిచేశారు. 2010-14 మధ్య గుంటూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ తరఫున హైకోర్టులో స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. 2016-17లో ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రధాన కార్యదర్శిగా సేవలు అందించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - Aug 02 , 2025 | 04:15 AM