Former TTD chairman Adikesavulu Naidu: టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు కుమారుడు, కుమార్తె అరెస్టు
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:55 AM
రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్...
ఆరేళ్ల క్రితం నాటి ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుమానాస్పద మృతి కేసులో సీబీఐ చర్యలు
ఆస్తి రాయించుకొని, హత్య చేశారనే ఆరోపణలు
బెంగళూరు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): రియల్ ఎస్టేట్ వ్యాపారి రఘునాథ్ అనుమానాస్పద మృతి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్, కుమార్తె కల్పజ, డీఎస్పీ మోహన్ను సీబీఐ అఽధికారులు సోమవారం అరెస్టు చేశారు. రఘునాథ్.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా భూముల క్రయవిక్రయాలు చేసేవారు. బెంగళూరు వైట్ ఫీల్డ్లోని నిందితుల గెస్ట్హౌ్సలో ఆయన 2019 మేలో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించారు. తన భర్తను కిడ్నాప్ చేసి హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని రఘునాథ్ భార్య మంజుల బెంగళూరు హెచ్ఏఎల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్తో పాటు దామోదర్, రామచంద్రయ్య, ప్రతాప్ అనే వ్యక్తులపై ఆరోపణలు చేశారు. అప్పట్లో ఇన్స్పెక్టర్గా ఉన్న మోహన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. రఘునాథ్ది ఆత్మహత్య అన్నట్లు కోర్టుకు బీ-రిపోర్ట్ సమర్పించారు. దీన్ని సవాలు చేస్తూ మంజుల హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు దర్యాప్తు కోసం న్యాయస్థానం సిట్ను ఏర్పాటు చేయించింది. సిట్ కూడా అదే తరహా నివేదిక ఇవ్వడంతో మంజుల హైకోర్టు విస్తృత ధర్మాసనాన్ని ఆశ్రయించారు. విచారించిన ధర్మాసనం.. రఘునాథ్ మృతిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. సీబీఐ చెన్నై విభాగం ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం డీఎస్పీగా ఉన్న మోహన్తోపాటు ఆదికేశవులు నాయుడు కుమారుడు, కుమార్తెను అరెస్టు చేసింది. నిందితులు నకిలీ స్టాంప్ పేపర్లను ఉపయోగించి రఘునాథ్ ఆస్తి రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.