TTD Chairman B.R. Naidu: 2 గంటల్లో శ్రీవారి దర్శనం
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:34 AM
తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే పూర్తయ్యేలా త్వరలోనే చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు చైర్మన్ బీ.ఆర్. నాయుడు అన్నారు.
‘శ్రీ వేంకటేశ్వర ఎయిర్పోర్టు’గా తిరుపతి విమానాశ్రయం
శారదా పీఠానికి భూముల లీజులు రద్దు: టీటీడీ చైర్మన్
హైదరాబాద్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే పూర్తయ్యేలా త్వరలోనే చర్యలు తీసుకుంటామని టీటీడీ బోర్డు చైర్మన్ బీ.ఆర్. నాయుడు అన్నారు. దీనికోసం ఏఐ సాయంతో ప్రణాళిక రూపొందించామని తెలిపారు. దీనికి సంబంధించిన ఫైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని, త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. బోర్డు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించి గురువారానికి ఏడాది అయిన సందర్భంగా బుధవారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. శ్రీవాణి ట్రస్టు కింద దళిత వాడల్లో వెంకన్న ఆలయాలను నిర్మించనున్నామని, ప్రాథమికంగా 5వేలకు పైగా వాడల్లో నిర్మాణాలను ప్రతిపాదించినట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లోనూ శ్రీవారి గుడులు నిర్మించాలన్న సీఎం చంద్రబాబు సూచనలతో కార్యాచరణ రూపొందించామని వివరించారు. తిరుమల కొండ కింద సుమారు 50 ఎకరాల్లో 25వేల మంది భక్తులకు వసతి, మౌలిక సౌకర్యాలు కల్పించే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. తిరుపతి విమానాశ్రయానికి ‘శ్రీ వేంకటేశ్వర ఎయిర్పోర్టు’గా నామకరణం చేశామని, ఈ ఫైలును క్యాబినెట్కు పంపామని, ఆమోదం పొందాక కేంద్రానికి పంపనున్నట్టు వివరించారు. వైసీపీ హయాంలో తిరుపతి ఫ్లైవోవర్కు పెట్టిన ‘శ్రీనివాస సేతు’ పేరును మళ్లీ ‘గరుడ వారధి’గా మార్చామని తెలిపారు. విశాఖ శారదా పీఠానికి కొండపై కేటాయించిన భూముల లీజులను రద్దు చేశామని చెప్పారు. దేశవ్యాప్తంగా టీటీడీ ఆలయాల్లో నిత్యాన్నదానం చేయనున్నట్టు తెలిపారు. ఏడాది పాలనలో రూ.1,000 కోట్ల విరాళాలు వచ్చాయని చెప్పారు. ఒంటిమిట్ట ఆలయం వద్ద 100 గదులతో వసతి గృహం నిర్మాణంతో పాటు 108 అడుగుల జాంబవంతుని విగ్రహం ఏర్పాటుచేయనున్నట్టు వివరించారు.