AP Govt: నేటి నుంచి గిరిజన విద్యార్థుల సాంస్కృతిక సంబరం
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:16 AM
జాతీయ స్థాయి గిరిజన విద్యార్థుల వేడుక ఉద్భవ్-2025కు రాష్ట్ర రాజధాని అమరావతి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్....
అమరావతి వేదికగా ఉద్భవ్-2025కు సర్వంసిద్ధం
జాతీయ వేడుకలకు తొలిసారి ఏపీ ఆతిథ్యం
అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయి గిరిజన విద్యార్థుల వేడుక ఉద్భవ్-2025కు రాష్ట్ర రాజధాని అమరావతి సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(ఈఎంఆర్ఎస్) సాంస్కృతిక ఉత్సవాలకు తొలిసారి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ ప్రభుత్వం పకడ్బందీగా చేసింది. అమరావతిలోని కేఎల్ యూనివర్సిటీలో ఈనెల 3, 4, 5 తేదీల్లో మూడు రోజుల పాటు జరిగే 6వ జాతీయ స్థాయి ఈఎంఆర్ఎస్ సాంస్కృతిక ఉత్సవాల్లో గిరిజన విద్యార్థుల ఆటపాటలు, సంస్కృతి, సంప్రదాయాలు ఒకే వేదికపై కనువిందు చేయనున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ హాజరవుతున్నారు. అలాగే ప్రారంభకార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పాల్గొననున్నారు. పోటీలకు కృష్ణ జింకను మస్కట్గా ఎంపిక చేశారు. దానికి క్రిష్గా నామకరణం చేశారు.