ట్రాన్స్కోనా మజాకా!
ABN , Publish Date - May 19 , 2025 | 01:04 AM
విద్యుతశాఖ అధికారుల వ్యవహారశైలి అనేక విమర్శలకు దారితీస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే విజయవాడ ఎయిర్ పోర్టులో 132/32 కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టారు. పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో తాపీగా ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసినా, కోర్టును ఆశ్రయించినా పనులు నిలుపుదల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే కాక గతంలో గన్నవరం పాత సబ్ స్టేషన్ పక్కన కోట్ల రూపాయలతో కొత్త స్టేషన్ నిర్మించారు. ప్రారంభం కూడా చేయకుండా వదిలేశారు. మేథా టవర్ సమీపంలో సబ్స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి.. వెంటనే పనులు ఆపేశారు. ఇప్పుడు మూడో సబ్స్టేషన్ పనులు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు.
- ఎయిర్పోర్టులో చురుగ్గా 132/32 కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులు
- ఇప్పుడు తాపీగా ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ విడుదల
- పనులు ప్రారంభానికి ముందే ఇవ్వాల్సిన నోటిఫికేషన్ తర్వాత ఇవ్వడంపై విమర్శలు
- ఇప్పటికే ఒక సబ్ స్టేషన్ నిర్మించి పాడుబెట్టారు.. మరోదానికి పనులు ప్రారంభించి వదిలేశారు!
- తాజాగా మూడో దాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు..
- విద్యుతశాఖ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు
విద్యుతశాఖ అధికారుల వ్యవహారశైలి అనేక విమర్శలకు దారితీస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే విజయవాడ ఎయిర్ పోర్టులో 132/32 కేవీ సబ్స్టేషన్ నిర్మాణ పనులు చేపట్టారు. పనులు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో తాపీగా ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేసినా, కోర్టును ఆశ్రయించినా పనులు నిలుపుదల చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే కాక గతంలో గన్నవరం పాత సబ్ స్టేషన్ పక్కన కోట్ల రూపాయలతో కొత్త స్టేషన్ నిర్మించారు. ప్రారంభం కూడా చేయకుండా వదిలేశారు. మేథా టవర్ సమీపంలో సబ్స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టి.. వెంటనే పనులు ఆపేశారు. ఇప్పుడు మూడో సబ్స్టేషన్ పనులు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
గన్నవరంలోని విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మిస్తున్న 132/33 కేవీ విద్యుత సబ్స్టేషన్ పనులకు సంబంధించి ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనల కోసం ఈ నెల 13వ తేదీన గజిట్ నోటిఫికేషన్ను విద్యుత శాఖ అధికారులు విడుదల చేశారు. వాస్తవంగా ఈ గజిట్ నోటిఫికేషన్ను పనులు ప్రారంభించటానికి రెండు నెలల ముందు ఇవ్వాలి. కానీ ట్రాన్స్కో అధికారులు మాత్రం పనులు ప్రారంభించి, పురోగతిలో ఉన్న తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తే ఏమి చేస్తారు? ప్రజాభిప్రాయ సేకరణ విధానాన్ని అపహాస్యం పాలుచేశారని కోర్టును ఆశ్రయిస్తే ఏమవుతుందన్న ఆలోచన కూడా చేయకపోవటం గమనార్హం. ఒకవేళ కోర్టు అక్షింతలు వేసి పనులు నిలుపుదల చేయమంటే ఇప్పటి వరకు ఖర్చుపెట్టిన కోట్ల రూపాయలు వృథా అయినట్టేనని విమర్శలు వినిపిస్తున్నాయి.
ముచ్చటగా మూడోది..
గన్నవరంలో కడుతున్న మూడో 32 కేవీ సబ్స్టేషన్ ఇది. ప్రస్తుతం గన్నవరంలో ఉన్న పాత సబ్స్టేషన్ పక్కనే కోట్లాది రూపాయల వ్యయంతో సబ్స్టేషన్ను కట్టి, దానిని వినియోగంలోకి తీసుకురాకుండా వదిలేశారు. దీంతో పాత సబ్స్టేషనే దిక్కుగా మారింది. కొత్తగా కట్టిన సబ్స్టేషన్ను అందుబాటులోకి తీసుకురాకుండానే.. మేథా ఐటీ టవర్ సమీపంలో 132/33 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అక్కడ కూడా సబ్స్టేషన్ కట్టడానికి టెండర్లు పిలిచారు. పనులు ప్రారంభించగానే.. ఆగిపోయాయి. దీంతో ఈ రెండింటినీ కాదని గన్నవరం ఎయిర్పోర్టులో మూడోదిగా సబ్స్టేషన్ నిర్మిస్తున్నారు. రెండు చోట్ల విఫలమైన విద్యుత శాఖ అధికారులు కనీసం మూడో చోట అయినా జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి.. ఇక్కడ కూడా పనులు మొదలు పెట్టేసి పురోగతిలో ఉన్న తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. పనులు మొదలు పెట్టేసిన తర్వాత అభ్యంతరాలు తీసుకోవటమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.