Share News

Kurnool Bus Accident: అగ్నికి ఆహుతి.. 19 మంది సజీవ దహనం..

ABN , Publish Date - Oct 25 , 2025 | 04:25 AM

అది... ‘వేమూరి కావేరి’ ట్రావెల్స్‌ బస్సు డీడీ01 ఎన్‌9490 నంబర్‌... మల్టీ యాక్సిల్‌ స్కానియా ఏసీ స్లీపర్‌ బస్‌ హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళుతోంది గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌లోని లకడీ కపూల్‌లో బయలుదేరింది.

Kurnool Bus Accident: అగ్నికి ఆహుతి.. 19 మంది సజీవ దహనం..

  • కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదం

  • హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ‘వేమూరి కావేరి’ బస్సు

  • జాతీయ రహదారిపై బైక్‌ను ఢీకొట్టి 200 మీటర్లు అలాగే ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌

  • బస్సు కింద ఇరుక్కుపోయిన పల్సర్‌ బైక్‌

  • పెట్రోల్‌ ట్యాంకు మూత ఊడి మంటలు

  • క్షణాల్లో బస్సుకు వ్యాపించిన అగ్నికీలలు

  • సెన్సర్లు పనిచేయక తెరుచుకోని డోర్లు

  • బయటికి వచ్చే దారిలేక ఆర్తనాదాలు

  • బస్సులోనే మాడిమసైన మృతదేహాలు

  • డీఎన్‌ఏ పరీక్షల అనంతరమే అప్పగింత

  • 27 మంది సురక్షితంగా బయటకు

  • బస్సు ఢీకొనడంతో యువకుడి మృతి

దీపావళి సెలవులు సరదాగా గడిపి తిరిగి బయలుదేరిన వారు కొందరు... ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారు కొందరు... వ్యాపార, ఇతర అవసరాల కోసం ప్రయాణమైన వారు కొందరు... గమ్యస్థానం బెంగళూరు... స్లీపర్‌ బస్సులో ఆదమరిచి నిద్రిస్తున్నారు! అదే వారికి శాశ్వత నిద్ర అయ్యింది. బహుశా... ‘బస్సు ఢీ... బైకర్‌ మృతి’ అని మాత్రమే వినాల్సిన వార్త!

కానీ... 19 నిండు ప్రాణాలు సజీవ దహనమయ్యాయి. వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉన్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఆరు రాష్ట్రాలకు చెందిన వారు బాధితులుగా మిగిలారు. కర్నూలు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో... జరిగిన పెను విషాదమిది! ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు, ఇతర అధికార వర్గాలు అందించిన సమాచారం ప్రకారం..... ఇవీ ఆ వివరాలు!

(కర్నూలు - ఆంధ్రజ్యోతి)

అది... ‘వేమూరి కావేరి’ ట్రావెల్స్‌ బస్సు! డీడీ01 ఎన్‌9490 నంబర్‌... మల్టీ యాక్సిల్‌ స్కానియా ఏసీ స్లీపర్‌ బస్‌! హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళుతోంది! గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్‌లోని లకడీ కపూల్‌లో బయలుదేరింది. 11:05 గంటలకు ఆరాంఘర్‌ చౌరస్తాకు చేరుకుంది. అక్కడ ముగ్గురు ప్రయాణికులను ఎక్కించుకొని ఎన్‌హెచ్‌-44పై బెంగళూరు దిశగా కదిలింది. రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులు 39 మంది... టికెట్‌ అక్కర్లేని చిన్న పిల్లలు నలుగురు... మధ్యలో ఎక్కిన మరో ప్రయాణికుడు... ఇద్దరు డ్రైవర్లు! బస్సులో మొత్తం 46 మంది!


బెంగళూరులో వివిధ కంపెనీల్లో పని చేసే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు, ప్రైవేట్‌ కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు, వివిధ వ్యాపారాలు చేసే వాళ్లు... పనులపైనా, దీపావళి పండుగ సెలవుల కోసం హైదరాబాద్‌కు వచ్చి.. తిరిగి బెంగళూరుకు వెళ్తున్నవారే అధికం! సిటీ దాటగానే... ఒక్కొక్కరుగా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి దాటాక 2.40 గంటల సమయంలో... బస్సు చిన్న టేకూరు దాటుతోంది. బస్సుకు ఇద్దరు డ్రైవర్లున్నారు. ఆ సమయంలో మిర్యాల లక్ష్మయ్య బస్సు నడుపుతున్నాడు. అంతకుముందు వరకు బస్సు నడిపిన మరో డ్రైవర్‌ శివనారాయణ... వెనుకవైపు డిక్కీలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. అంతలో ఏం జరిగిందంటే....


దఢేల్‌మనే శబ్దంతో...

కర్నూలు శివారులోని ప్రజానగర్‌కు చెందిన బి.శివశంకర్‌(21) అనే యువకుడు ఇళ్లలో గ్రానైట్‌ ఫ్లోరింగ్‌ పనులు చేస్తుంటాడు. నంద్యాల జిల్లా డోన్‌లో పని దొరికింది. తెల్లవారక ముందే అక్కడ ఉండాలని అర్ధరాత్రి తర్వాతే బయల్దేరాడు. కానీ... అతడిని దురదృష్టం వెంటాడింది. శివశంకర్‌ పల్సర్‌ బైక్‌ను వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. శివశంకర్‌ ఎగిరి రోడ్డుపక్కన పడిపోయాడు. బైక్‌ మాత్రం బస్సు కిందికి వెళ్లి... ముందు వైపున్న యాక్సిల్‌లో ఇరుక్కుంది. ‘దఢేల్‌’ అంటూ పెద్ద శబ్దం... కుదుపు! ప్రయాణికుల్లో కొందరికి మెలకువ వచ్చింది కానీ... ఏం జరిగిందో తెలియదు! ఆ సమయంలో బస్సు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. అప్పటికప్పుడు బ్రేక్‌ వేసి, బస్సును ఆపి ఉంటే సరిపోయేది. కానీ... ప్రమాదం జరిగిందన్న కంగారువల్లో, మరే కారణం చేతనో డ్రైవర్‌ ఆ పని చేయలేదని తెలుస్తోంది. సుమారు 200 మీటర్లు అలాగే... బస్సును ముందుకు తీసుకెళ్లాడు! దాని ఫలితమే...


కాల్చేసిన నిప్పు రవ్వలు

బస్సు కింద ఇరుక్కుపోయిన బైక్‌... రోడ్డును బలంగా రాసుకుంటూ అలాగే వచ్చేసింది! ఈ క్రమంలో బైక్‌ పెట్రోల్‌ ట్యాంక్‌ మూత ఊడిపోయింది. పెట్రోల్‌ బయటికి చిమ్మింది. బైక్‌, రోడ్డు మధ్య జరిగిన రాపిడితో నిప్పు రవ్వలు ఎగిశాయి. పెట్రోలు అంటుకుంది. దాంతోపాటు బస్సుకు కూడా మంటలు వ్యాపించాయి. డ్రైవర్‌ లక్ష్మయ్య వెంటనే బయటకు దూకాడు. వెనుక వైపు డిక్కీలో నిద్రిస్తున్న మరో డ్రైవర్‌ శివనారాయణను లేపాడు. ‘బస్సుకు మంటలు అంటుకున్నాయి’ అని కేకలు వేసి... అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బస్సులోపలున్న ప్రయాణికులను మృత్యుకీలలు ఆవరించడం మొదలైంది. బైక్‌ను ఢీకొట్టిన సమయంలో వచ్చిన శబ్దానికి మేల్కొన్న కొందరు ప్రయాణికులు బస్సు డ్రైవర్‌ వెళ్లిన మార్గంలోనే కిందికి దూకారు. ‘మంటలు... మంటలు... బస్సుకు నిప్పంటుకుంది దూకండి.. దూకండి’ అంటూ బిగ్గరగా కేకలు వేశారు. గాఢ నిద్రలో ఉన్న వారు ఉలిక్కిపడి లేచారు. అప్పటికే పొగలు కమ్ముకుంటున్నాయి. మంటలు, వేడికి సెన్సర్లు పనిచేయకపోవడంతో... ‘ఆటోమేటిక్‌ డోర్లు’ లాక్‌ అయిపోయాయి. అత్యవసర (ఎమర్జెన్సీ) ద్వారాలు కూడా తెరుచుకోలేదు. అద్దాలు పగలగొట్టేందుకు అవసరమైన ‘హ్యామర్లు’ కూడా కనిపించలేదు. లోపలున్న వారిది దిక్కుతోచని పరిస్థితి! చేతులతో, భుజాలతో అద్దాలు పగలగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈలోపే... రెండో డ్రైవర్‌ శివనారాయణ జాకీ తీసి బయటి నుంచి అద్దాలు పగొలగొట్టాడు. బస్సు వెనుకే మరో కారులో వెళుతున్న హరీశ్‌ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి రాళ్లతో అద్దాలు బద్దలు కొట్టాడు. దీంతో... లోపలున్న ప్రయాణికుల్లో కొందరు చకచకా కిందికి దూకారు. అప్పటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ముందు వైపున స్లీపర్‌ బెర్తుల మధ్య ఇరుక్కున్న వారు బయటికి వచ్చే మార్గమే కనిపించలేదు. వారంతా నిస్సహాయ స్థితిలో.. అగ్ని కీలల మధ్య ఆర్తనాదాలు చేస్తూ సజీవ దహనమయ్యారు. మృతదేహాలన్నీ గుర్తుపట్టలేనంతగా... మాంసపు ముద్దలుగా మారాయి.


ప్రమాద విషయం తెలియగానే కర్నూలు రేంజ్‌ డీఐజీ కోయ ప్రవీణ్‌, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, కర్నూలు, డోన్‌ డీఎస్పీలు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. పోలీసులు వచ్చేసరికే... ఆరుగురు క్షతగాత్రులు ఒక ప్రైవేట్‌ వాహనాల్లో వారంతట వారే ఆస్పత్రికి చేరుకున్నారు. మిగిలిన వారిని అంబులెన్స్‌లలో ఆస్పత్రికి తరలించారు. బుగ్గిగా మారిన బస్సులో చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలను జాగ్రత్తగా ఒకచోట చేర్చారు. డీఎన్‌ఏ పరీక్షలు చేసిన తర్వాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా కర్నూలుకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతులలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారూ ఉండటంతో ఆ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడుతో కలిసి సంఘటన స్థలానికి పరిశీలించారు. పోలీసులు ఇద్దరు డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. బైకును ఢీకొన్న తర్వాత బస్సును ఆపితే తనపై దాడి చేస్తారేమోనని అలాగే ముందుకు వెళ్లినట్లు లక్ష్మయ్య అనే డ్రైవర్‌ విచారణలో చెప్పాడు.


ఆ బస్సులో భారీగా కొత్త సెల్‌ఫోన్లు

కర్నూలు క్రైం: కాలిపోయిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో ఖరీదైన 234 సెల్‌ఫోన్లు దగ్ధమయ్యాయి. హైదరాబాద్‌కు చెందిన మంగనాథ్‌ అనే వ్యాపారి రూ.46లక్షలు విలువైన రియల్‌మీ కంపెనీ సెల్‌ఫోన్ల బాక్సులను బస్సులో పార్సిల్‌ చేశారు. ఇవి బెంగళూరులోని ఫ్లిప్‌కార్టుకు చేరాల్సి ఉంది. అక్కడి నుంచి కస్టమర్లకు అవి సరఫరా అవుతాయి. ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రమాద స్థలానికి చేరుకుని, లబోదిబోమన్నారు. కాగా.. ప్రమాదంలో మంటల తీవ్రత పెరగడానికి ఈ సెల్‌ఫోన్ల బ్యాటరీలు పేలిపోవడం కూడా ఓ కారణమేనని ఫోరెన్సిక్‌ నిపుణులు అంటున్నారు. మంటలకు ఆ ఫోన్లు కాలిపోవడంతో బ్యాటరీలు పేలిపోయిన శబ్దం వచ్చిందని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు.

Untitled-3 copy.jpg

ఎస్పీకి ఫోన్‌ చేసి సమాచారం

కర్నూలు క్రైం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): బస్సు ప్రమాదం జరిగిన వెంటనే ఓ మహిళ స్పందించి నేరుగా కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు సమాచారం ఇచ్చారు. హైదరాబాద్‌కు చెందిన హేమారెడ్డి అనే మహిళ పుట్టపర్తికి వెళ్లి... గురువారం రాత్రి 11గంటలకు కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఆ వాహనం ప్రమాద స్థలం వద్దకు రాగానే.. ఓ బస్సు మంటల్లో కాలిపోతోందని డ్రైవర్‌ చెప్పడంతో ఆమె కారు దిగి అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఓ వ్యక్తి వద్ద ఫోన్‌ అడిగి.. తనకు తెలిసిన ఓ పోలీస్‌ అధికారికి కాల్‌ చేసి కర్నూలు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ నంబర్‌ తీసుకున్నారు. వెంటనే ఎస్పీకి ఫోన్‌చేసి బస్సు ప్రమాదం సమాచారం ఇచ్చారు.

Untitled-4 copy.jpg


12 మందిని కాపాడిన రెండో డ్రైవర్‌!

కనిగిరి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో డ్రైవర్‌ భయంతో అక్కడి నుంచి పారిపోగా.. రెండో డ్రైవర్‌ ప్రాణాలకు తెగించి 12 మందిని కాపాడారు. ప్రమాదానికి గురైన బస్సులో ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన గుడిపాటి శివనారాయణ కూడా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. తన బిట్‌ (నడిపే ప్రాంతం) వరకు బస్సు నడిపిన తర్వాత శివనారాయణ మరో డ్రైవర్‌ లక్ష్మయ్యకు డ్రైవింగ్‌ అప్పగించి బస్సువెనుక డిక్కీలో పడుకున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత లక్ష్మయ్య బస్సు ఆపి శివనారాయణను నిద్రలేపాడేజ ఆ సమయంలోనే మంటలు చెలరేగడంతో లక్ష్మయ్య అక్కడినుంచి పారిపోగా.. శివనారాయణ జాకీతో అద్దాలు పగులగొట్టి దాదాపు 12 మందిని బయటికి రప్పించారు.

స్నేహితుడి కోసం నిరీక్షణే కాపాడింది!

కర్నూలు, హైదరాబాద్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): కర్నూలు బస్సు ప్రమాదం నుంచి ఓ నేవీ కమాండర్‌ లక్కీగా తప్పించుకొన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన తరుణ్‌ కుమార్‌ (27) బెంగుళూరులో నేవీలో లెఫ్టినెంట్‌ కమాండర్‌గా పనిచేస్తున్నారు. దీపావళికి ఇంటికి వచ్చిన ఆయన సెలవులు ముగియడంతో బెంగళూరు వెళ్లేందుకు గురువారం వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సులో టికెట్‌ బుక్‌ చేసుకున్నారు. రాత్రి 10గంటలకు లక్డీకాపూల్‌ వద్ద ఆయన బస్సు ఎక్కాల్సి ఉంది. అయితే స్నేహితుడి కోసం నిరీక్షిస్తూ.. బస్సు డ్రైవర్‌కు ఫోన్‌ చేసి శంషాబాద్‌లో ఎక్కుతానని చెప్పారు. రాత్రి 11.20 గంటలకు బస్సు శంషాబాద్‌కు చేరుకున్నాక డ్రైవర్‌ ఫోన్‌ చేస్తే మీరు వెళ్లిపోండని చెప్పారు. ఓ గంట తర్వాత తరుణ్‌ కుమార్‌ మరో బస్సులో బెంగుళూరుకు బయల్దేరారు. స్నేహితుడి కోసం నిరీక్షించడమే తన ప్రాణాలు కాపాడిందని తరుణ్‌కుమార్‌ చెప్పుకొచ్చారు.


నా రెండు కాళ్లు విరిగాయి

25 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం తల్లిదండ్రులు హైదరాబాద్‌ వచ్చారు. మూసాపేటలో నివాసం ఉంటున్నాం. బీటెక్‌ పూర్తి చేశాను. బెంగళూరులో ఇంటర్వ్యూ ఉండటంతో గురువారం రాత్రి బయల్దేరాను. బస్సులో మంటలు చెలరేగడంతో అద్దాన్ని పగులకొట్టి బయటికి దూకేశాను. నా రెండు కాళ్లు విరిగాయి. ప్రస్తుతం నంద్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. నా కళ్లెదుటే బస్సు మంటల్లో ప్రయాణికులు కాలిపోయారు.

Untitled-2 copy.jpg

- జయసూర్య, నెమళ్లదిన్నె,

పెద్దముడియం మండలం, కడప జిల్లా

తెల్లారేలోగా పనిలో చేరాలని..!

కర్నూలు/కర్నూలు న్యూసిటీ: ‘అమ్మా ఉదయాన్నే పని ఉంది. అర్థరాత్రే బయలుదేరి వెళ్తా. ఇంటికొస్తా కొత్త టీవీ తెస్తా’ అని చెప్పి వెళ్లిన కొడుకు శవమయ్యాడు. తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్‌ మండలం కసాపురం గ్రామానికి చెందిన యశోద, నాగన్న దంపతులకు శ్రీహరి, శివశంకర్‌... సంతానం. 2015లో నాగన్న మృతి చెందడంతో తల్లి యశోదతో కలసి కర్నూలు నగర శివారులో ప్రజానగర్‌లో వారు జీవితాన్ని మొదలుపెట్టారు. శివశంకర్‌ ఇళ్లలో గ్రానైట్‌ రాళ్లు పరిచే పని చేస్తున్నాడు. అన్న శ్రీహరి, తల్లి యశోద భవన నిర్మాణ పనులకు వెళ్తూ బతుకు బండి లాగిస్తున్నారు. ఇల్లు గడవాలంటే బండలు పరవాల్సిందే. గురువారం రాత్రి మేస్త్రి ఫోన్‌ చేసి ‘డోన్‌లో పనుంది. తెల్లారేపాటికి రావాలి’ అని చెప్పాడు. దీంతో శుక్రవారం అర్థరాత్రి సుమారు 2.15 గంటలకు శవశంకర్‌ తన పల్సర్‌ బైక్‌పై బయలుదేరాడు. బస్సు ఢీకొట్టడంతో ఎగరి రోడ్డు పక్కనపడి చనిపోయాడు. ఈ బైకు, బస్సు ఢీకొన్న ప్రమాదమే మరో 19 మంది మరణానికి కారణమైంది.

Untitled-3 copy.jpg

Updated Date - Oct 25 , 2025 | 06:14 AM