Nellore: రౌడీషీటర్ శ్రీకాంత్ వ్యవహారంలో మరో ముగ్గురు కానిస్టేబుళ్లపై వేటు
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:49 AM
రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్ వ్యవహారంలో మరో ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు సస్పెండయ్యారు. ఇప్పటికే ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు సస్పెండైన సంగతి తెలిసిందే.
ఇప్పటికే ముగ్గురి సస్పెన్షన్
నెల్లూరు (క్రైం), ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్, జీవిత ఖైదీ శ్రీకాంత్ వ్యవహారంలో మరో ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు సస్పెండయ్యారు. ఇప్పటికే ముగ్గురు ఏఆర్ కానిస్టేబుళ్లు సస్పెండైన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబరు 15న శ్రీకాంత్ను నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి తిరుపతిలోని స్విమ్స్కు ఎస్కార్ట్ సిబ్బంది తమ వాహనంలో తరలించారు. నెల్లూరు సిటీ సరిహద్దులు దాటగానే శ్రీకాంత్ ఆ వాహనం దిగి ప్రైవేటు వాహనం ఎక్కారు. ప్రైవేటు వాహనం రోడ్డుప్రమాదానికి గురికావడంతో శ్రీకాంత్ చేతికి గాయమైనట్లు ‘ఆంధ్రజ్యోతి’ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ఎస్కార్ట్ వాహనంలోని ఖలీల్, ఖాజా మొహిద్దీన్, సుబ్బారావు అనే ఏఆర్ కానిస్టేబుళ్లను అప్పట్లో సస్పెండ్ చేశారు. ప్రమాదానికి గురైన ప్రైవేటు వాహనంలో ఉన్న ఏఆర్ హెడ్కానిస్టేబుల్ గోపాల్, కానిస్టేబుళ్లు గంగరాజు, కిశోర్లపైనా తాజాగా వేటు వేస్తూ జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.