World Telugu Conference: 3, 4, 5 తేదీల్లో మూడవ తెలుగు మహాసభలు
ABN , Publish Date - Dec 27 , 2025 | 05:26 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం మూడో ప్రపంచ తెలుగు మహాసభలు-2026 గుంటూరు జిల్లాలో జరగనున్నాయి.
గుంటూరులో విస్త్రృత ఏర్పాట్లు
40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఆహ్వానం
గుంటూరు, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం మూడో ప్రపంచ తెలుగు మహాసభలు-2026 గుంటూరు జిల్లాలో జరగనున్నాయి. జనవరి 3, 4, 5 తేదీల్లో ఎన్హెచ్-16 పక్కనే ఉన్న శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరం ఈ వేడుకలకు ఆతిథ్యమివ్వనుంది. ఈ సభలకు తెలుగువారి అనురాగ సంగమంగా నామకరణం చేశారు. ప్రజా గాయకుడు డాక్టర్ గజల్ శ్రీనివాస్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ గత కొన్ని నెలలుగా మహాసభలను విజయవంతం చేసేందుకు శ్రమిస్తున్నారు. 40 దేశాలకు చెందిన 62 తెలుగు సంఘాలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపగా తాము తప్పక పాల్గొంటామని ఆయా అసోసియేషన్లు సమాచారం పంపాయి. మూడు రోజుల పాటు మొత్తం 22 సాహితి సదస్సులు జరుగుతాయి. 4వ తేదీన ఉత్తరాఖండ్ నుంచి వచ్చే ఆదిశంకర పీఠాధిపతుల ప్రవచనం ఉంటుంది. నాలుగు రాష్ట్రాల గవర్నర్లు హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. ఎన్టీఆర్ పేరిట ప్రధాన వేదిక ఏర్పాటు చేశారు. మూడు రోజుల్లో లక్ష మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు.