‘వందే భారత’ డిపో రెడీ!
ABN , Publish Date - May 20 , 2025 | 12:53 AM
బెజవాడ కేంద్రంగా జరుగుతున్న వందేభారత ఎక్స్ప్రెస్ రైళ్ల మెయింట్నెన్స్ డిపో పనులు తుది దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే డిపో ప్రారంభం కానుంది. విజయవాడ మీదుగా ప్రస్తుతం మూడు వందేభారత రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - విశాఖపట్నం వయా విజయవాడ, విజయవాడ - చెన్నై, తిరుపతి - విజయవాడ (అవుటర్) మధ్యన మొత్తం మూడు వందేభారత రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో పెద్ద ఎత్తున వందేభారత రైళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరికొన్ని రూట్లలో వందేభారత ఎక్స్ప్రెస్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే అవకాశం ఉంది.
-ఇక విజయవాడ కేంద్రంగా నిర్వహణ పనులు
-డిపో, పరిపాలనా భవ నం, రైలు ట్రాక్ సిద్ధం
-భారీ మంచినీటి ట్యాంక్ ఏర్పాటు
-ప్రస్తుతం నడుస్తున్న మూడు వందేభారతలు
-రానున్న రోజుల్లో పెరగనున్న రైళ్లు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): బెజవాడ కేంద్రంగా జరుగుతున్న వందేభారత ఎక్స్ప్రెస్ రైళ్ల మెయింట్నెన్స్ డిపో పనులు తుది దశకు చేరుకున్నాయి. మరికొద్ది రోజుల్లోనే డిపో ప్రారంభం కానుంది. విజయవాడ మీదుగా ప్రస్తుతం మూడు వందేభారత రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ - విశాఖపట్నం వయా విజయవాడ, విజయవాడ - చెన్నై, తిరుపతి - విజయవాడ (అవుటర్) మధ్యన మొత్తం మూడు వందేభారత రైళ్లు నడుస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో పెద్ద ఎత్తున వందేభారత రైళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మరికొన్ని రూట్లలో వందేభారత ఎక్స్ప్రెస్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే అవకాశం ఉంది.
అన్ని వసతులు ఏర్పాటు
దేశంలోనే రెండో అతి పెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ కావటంతో ఇక్కడ వందేభారత రైళ్లకు మెయింట్నెన్స్ స్టేషన్ అవసరమన్న ఉద్దేశ్యంతో రైల్వేబోర్డు వందేభారత ఎక్స్ప్రెస్ రైళ్ల మెయింట్నెన్స్ డిపో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడలో మిల్క్ ఫ్యాక్టరీ ఎగువన ఫ్లై ఓవర్కు సమీపంలో రైల్వే యార్డుకు దగ్గరగా దీనిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే వందేభారత రైళ్లకు సరిపడా అతి పెద్ద డిపోను ఏర్పాటు చేశారు. ఈ డిపోలో మెట్రో రైల్ రావటానికి వీలుగా ట్రాక్లను సిద్ధం చేశారు. ఈ ట్రాక్స్ వెంబడే మెకానిక్లు నడుచుకుంటూ అటు, ఇటు వెళ్లటానికి వీలుగా కాంక్రీట్ స్లాబ్స్ ఏర్పాటు చేశారు. విజయవాడ - చెన్నై మధ్యన నడిచే వందేభారత రైలుకు ప్రస్తుతం విజయవాడలోనే మెయింట్ నెన్స్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడ - చెన్నై వందేభారత రైలుకు కోచింగ్ డిపోలో మెయింట్నెన్స్ పనులు జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రాగానే.. ఇక్కడి నుంచే వందేభారత రైళ్లకు ప్రత్యేకంగా మెయింట్ నెన్స్ చేస్తారు. మెయింట్నెన్స్ చార్ట్ ప్రకారం రైలును ప్రయాణ అవసరాలకు తగ్గట్టుగా ఇక్కడ సిద్ధం చేస్తారు. ఎలాంటి రిపేర్లు ఉన్నా కూడా ఇక్కడే నిర్వహిస్తారు. వందేభారత మెయింట్నెన్స్ కోసం పక్కనే ఒక పరిపాలనా భవనాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వందేభారత విభాగానికి సంబంధించిన విభాగాధిపతులు, ఇతర ఉద్యోగులు, సిబ్బంది విధులు నిర్వహిస్తారు. నిరంతర నీటి సరఫరాకు వీలుగా ఓవర్హెడ్ ట్యాంకును నిర్మించారు.