ఉధృతంగా హంద్రీ ప్రవాహం
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:51 PM
హంద్రీనదికి వరద పోటెత్తింది. ఆదివారం కల్లూరు వంతెనపై నది ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది.
కల్లూరు బిడ్జిపై పోటెత్తిన వరద
నదితీర కాలనీల్లో చేరిన నీరు
కర్నూలు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): హంద్రీనదికి వరద పోటెత్తింది. ఆదివారం కల్లూరు వంతెనపై నది ప్రమాదకర స్థాయిలో ప్రవహించింది. నగరంలోని కల్లూరు, విఠల్ నగర్, కృష్ణానగర్, దేవానగర్ తదితర కాలనీల ప్రజలు వరద ప్రవాహంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నది బఫర్ జోన ఆక్రమించి నిర్మించుకున్న ఇళ్లలోకి వరద నీరు చేరింది. పత్తికొండ, కోడుమూరు నియోజకవర్గాల్లో కురిసిన వర్షాలకు వంకలు, వాగులు పొంగిపొర్లాయి. భారీ ఎత్తున వరద హంద్రీదికి చేరింది. గాజులదిన్నె జలాశయం గరిష్ఠ సామర్థ్యం 4.50 టీఎంసీలు కాగా, 4.05 టీఎంసీలు నిల్వ చేసి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. అలాగే కృష్ణగిరి మండలంలో కురిసిన వర్షాలకు పాలహంద్రీ నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతోంది. కర్నూలు నగరంలో ఆదివారం ఉదయం 8 గంటలకు 30.500 క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంటే సాయంత్రం 5 గంటలకు 27 వేల క్యూసెక్కులకు తగ్గిపోయింది. జోహరాపురం సమీపంలో తుంగభద్రలో కలుస్తోంది. వానలు తగ్గడంతో వరద ఉధృతి తగ్గింది. లేకుంటే నదితీర ప్రాంతాలన్నీ నీట మునిగి భారీ నష్టం వచ్చే ప్రమాదం ఉందని ఇంజనీర్లు ఆందోళన వ్యక్తం చేశారు. వరద ముప్పు నుంచి గట్టెక్కాలంటే హంద్రీ ఇరువైపున ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.