TDR Scam: టీడీఆర్ విజిలెన్స్ నివేదిక ఏమైంది
ABN , Publish Date - Jul 28 , 2025 | 05:42 AM
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీఆర్(ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవల్పమెంట్ రైట్స్) బాండ్ల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ నివేదిక జాడ లేకుండా పోయింది.
ఉన్నతాధికారులకు చేరిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించని వైనం
(భీమవరం-(ఆంధ్రజ్యోతి )
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీఆర్(ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవల్పమెంట్ రైట్స్) బాండ్ల కుంభకోణంపై విజిలెన్స్ విచారణ నివేదిక జాడ లేకుండా పోయింది. ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి నెలలు గడిచిపోతున్నా ప్రభుత్వానికి చేరలేదు. గత వైసీపీ హయాంలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ దాదాపు రూ.140కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను జారీ చేసింది. వాటిని 40శాతానికి బయట మార్కెట్లో విక్రయించుకున్నారు. అంటే రూ.56 కోట్ల మేర లబ్ధి చేకూరింది. నియోజకవర్గ వైసీపీ నేత కూడా లబ్ధి పొందారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపై విజిలెన్స్ విచారణ కు ఆదేశించారు. దాదాపు 4నెలల పాటు సాగిన ఈ విచారణలో భాగంగా స్థల యజమాల నుంచి విజిలెన్స్ డీఎస్పీ వివరాలు సేకరించారు. తాడేపల్లిగూడెం- భీమవరం రహదారి విస్తరణకు అవకాశం లేకపోయినా బాండ్లు జారీ చేశారు. ఇప్పటికీ భూమి యజమానుల వద్దే ఉంది. స్థల యజమానులు కాకుండా భీమవరం పట్టణానికి చెందిన బ్రోకర్ సంతకాలు చేసి బాండ్లు తీసుకుని, విక్రయించుకున్నారు. కొంద రు యజమానులకు మాత్రం కొంతమేర ముట్టజెప్పారు. ఓ పాత సినిమా థియేటర్ స్థలంలో షాపిం గ్ కాంప్లెక్స్ అభివృద్ధి కోసం ఇచ్చిన యజమానులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదు. వైసీపీ నేత, బ్రోకర్తో పాటు, కాంప్లెక్స్ అభివృద్ధి చేసిన నిర్మాణదారులు బాండ్లు విక్రయించుకున్నారు. అలాగే తాడేపల్లిగూడెం-బీమవరం రహదారికి ఆనుకుని 4వేల చదరపు గజాల స్థలం కొందరు మహిళల పేరుతో ఉంది. అ క్కడ కాంప్లెక్స్ నిర్మాణానికి ఓ బిల్డర్ వారితో ఒప్పం దం చేసుకున్నారు. అందులో 1,000 గజాల స్థలాన్ని మున్సిపాలిటీకి రాసిచ్చారు. స్థల యజమానులైన మహిళలకు బదులుగా బిల్డర్ పేరుతో బాండ్లు జారీ చేశారు. వాటిని భీమవరం పట్టణానికి చెందిన ప్రసాద్రాజు అనే బ్రోకర్ తీసుకొని, విక్రయించేసుకున్నారు. ఇందులోనూ వైసీపీ నేత హస్తం ఉంది. దీనిపై ఇటీవల తాడేపల్లిగూడెంలో పర్యటించిన మంత్రి నారాయణకు బాధిత మహిళలు ఫిర్యాదు చేయడంతో ఆయన విస్తుపోయారు.