Parliament Committees: పార్లమెంటు కమిటీల ఏర్పాటుకు టీడీపీ కసరత్తు
ABN , Publish Date - Aug 23 , 2025 | 05:23 AM
పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీలతో శనివారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు.
త్రిసభ్య కమిటీలతో నేడు సీఎం చంద్రబాబు సమావేశం
24, 25, 26న పార్లమెంటు నియోజకవర్గాల్లో సమావేశాలు
అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీలతో శనివారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిన టీడీపీ.. పార్లమెంటు కమిటీలను ఏర్పాటు చేసే నిమిత్తం ప్రతిపాదనలను స్వీకరించేందుకు నియోజకవర్గాల వారీగా త్రిసభ్య కమిటీల నియామకం చేసింది. ఈ కమిటీలు నియోజకవర్గాలవారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్లమెంటు కమిటీలకు ప్రతిపాదనలు స్వీకరిస్తాయి. ఆ సమావేశాల నిర్వహణ ఎలా ఉండాలన్న దాని పై త్రిసభ్య కమిటీలకు చంద్రబాబు శనివారం భేటీలో దిశానిర్దేశం చేస్తారు. కాగా, 24న అనకాపల్లి, నరసాపురం, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ఒంగోలు నియోజకవర్గ కమిటీలకు, 25న అరకు, కాకినాడ, అమలాపురం, బాపట్ల, రాజంపేట, చిత్తూరు, కడప, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గ కమిటీలకు, 26న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, నెల్లూరు, తిరుపతి, నంద్యాల, కర్నూలు, అనంతపురం పార్లమెంటు నియోజకవర్గ కమిటీల ఏర్పాటుపై సమావేశాలు నిర్వహిస్తారు.