Share News

Supreme Court: చెవిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను విచారించండి

ABN , Publish Date - Oct 16 , 2025 | 06:25 AM

మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపాలని ట్రయల్‌ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

Supreme Court: చెవిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను విచారించండి

  • ట్రయల్‌ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరపాలని ట్రయల్‌ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో మరో నిందితుడికి ఇచ్చిన బెయిల్‌ను రద్దుచేయాలని రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తుది నిర్ణయం తీసుకునేదాకా బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరుపవద్దని ట్రయల్‌ కోర్టును హైకోర్టు ఆదేశించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. హైకోర్టు నిర్ణయాన్ని చెవిరెడ్డి ఈ నెల 10న సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌పై బుధవారం జస్టిస్‌ జేపీ పార్దీవాలా, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. వాదనల అనంతరం.. హైకోర్టు ఉత్తర్వులను నిలిపివేసింది. చెవిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు విచారించి.. కేసు మెరిట్స్‌ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మరో నిందితుడి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ మెరిట్‌పై కొనసాగించవచ్చని తెలిపింది. ఆ విచారణలోని అంశాలు, పరిశీలనలు చెవిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ఎలాంటి ప్రభావం చూపవంటూ విచారణను ముగించింది.

Updated Date - Oct 16 , 2025 | 06:27 AM