Share News

Super Six Alliance: సవాళ్లనే సవాల్‌ చేస్తూ!

ABN , Publish Date - Sep 08 , 2025 | 04:06 AM

గత పాలకులు ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లకుపైగా వెచ్చించామని గొప్పలు చెప్పుకొనేవారు. అందులో ప్రజలకు అందింది అంతంతే.. టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం 15 నెలల కాలంలోనే ప్రజల సంక్షేమానికి.. రాష్ట్రాభివృద్ధికి రూ.లక్ష కోట్లకుపైగా వ్యయం చేసింది...

Super Six Alliance: సవాళ్లనే సవాల్‌ చేస్తూ!

  • ఎల్లుండి అనంతలో భారీ బహిరంగ సభ‘సూపర్‌ సిక్స్‌..సూపర్‌ హిట్‌’ పేరుతో జనంలోకి

  • సీఎం, డిప్యూటీ సీఎం సహా హాజరుకానున్న కూటమి నేతలు

  • 15 నెలల్లో సవాళ్లను అధిగమించి సంక్షేమం, అభివృద్ధి

  • 15 నెలల్లో సామాజిక పింఛన్లకు రూ.45 వేల కోట్లు

  • తల్లికి వందనానికి 10 వేల కోట్లు.. అన్నదాతకు 3,200 కోట్లు

  • మెగా డీఎస్సీతో 16,347 టీచర్‌ పోస్టులు

  • మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. వివిధ వర్గాలకు చేయూత

  • 5 కోట్ల మందికీ 25 లక్షల వరకు యూనివర్సల్‌ హెల్త్‌ పాలసీ

  • 15 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు

అమరావతి, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): గత పాలకులు ఐదేళ్ల కాలంలో రూ.2 లక్షల కోట్లకుపైగా వెచ్చించామని గొప్పలు చెప్పుకొనేవారు. అందులో ప్రజలకు అందింది అంతంతే.. టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం 15 నెలల కాలంలోనే ప్రజల సంక్షేమానికి.. రాష్ట్రాభివృద్ధికి రూ.లక్ష కోట్లకుపైగా వ్యయం చేసింది. వైసీపీ ఆర్థిక విధ్వంసంతో కుదేలైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ముందుకెళ్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ విజయంపై కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ.. బుధవారం (10న) సంయుక్తంగా భారీ బహిరంగ సభను తలపెట్టాయి. అధికారంలోకి వచ్చాక కూటమి పార్టీలు కలిసి నిర్వహిస్తున్న మొట్టమొదటి సభ ఇది. అనంతపురంలోని ఇంద్రప్రస్థ నగర్‌లో 10న మధ్యాహ్నం 3గంటలకు జరిగే ఈ ‘సూపర్‌ సిక్స్‌.. సూపర్‌ హిట్‌’ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌, బీజేపీ అగ్రనేతలు పీవీఎన్‌ మాధవ్‌, మంత్రి సత్యకుమార్‌ హాజరుకానున్నారు. ఈ సభకు వివిధ ప్రాంతాలనుంచి లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 15 నెలల కూటమి ప్రభుత్వ పాలనా విజయాలను ఆవిష్కరించేలా దీనిని నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకూ అమలు చేసిన వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈ సభ ద్వారా ప్రజలకు చాటాలని కూటమి అగ్రనాయకత్వం భావిస్తోంది.


సవాళ్లున్నా సంక్షేమం.. అభివృద్ధి వైపే అడుగు

జగన్‌ ఐదేళ్ల విధ్వంసంతో రాష్ట్రం అప్పులకుప్పగా మారింది. వ్యవస్థలు ధ్వంసయ్యాయి. అవినీతి అక్రమాలతో రాబడి కుంటుపడింది. పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు పారిపోయాయి. ఏపీ రోడ్ల గురించి పొరుగు రాష్ట్రాల్లోనూ హేళనగా మాట్లాడిన దుస్థితి. అనేక ఆర్థిక సవాళ్లు ఉన్నా ఊహించని స్థాయిలో సంక్షేమం, అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం సంకల్పించింది. 15 నెలల క్రితం అధికారం చేపట్టి.. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా వేగంగా నిర్ణయాలను అమలు చేస్తూ వస్తోంది. సంక్షేమం ఒకవైపు.. అభివృద్ధి ఇంకో వైపు అంటూ పాలనను పరుగులు పెట్టిస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే.. పాలనా పగ్గాలు చేపడుతూనే పెంచిన పింఛన్లను అమలు చేసేలా సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. హామీ ఇచ్చిన నాటి నుంచే పెంచిన పింఛన్లు అమలయ్యేలా మూడు నెలల బకాయిలు కలిపి వృద్ధులు, దివ్యాంగులు, ఇలా వివిధ కేటగిరీలకు చెందిన పింఛనుదారులకు అందించారు. పింఛన్లపై ఇప్పటి వరకూ సుమారు రూ.45 వేల కోట్లు వ్యయం చేశారు. మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలెండర్లను ఇచ్చేలా దీపం 2.0 పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా వారందరికీ ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచింది. 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.13 వేల చొప్పున జమ చేసింది. దీని కోసం రూ.10 వేల కోట్లు వెచ్చించింది. ఒక్కొక్కరికీ 20వేల చొప్పున 44 లక్షల మంది రైతులకు మూడు విడతలుగా ఆర్థికసాయం అందించేలా అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికోసం రూ.3,200 కోట్లు వ్యయం చేసింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ స్త్రీశక్తి పథకం అమలు చేస్తోంది. 5 కోట్లపైచిలుకు ప్రయాణాలతో మహిళలు దీన్ని సూపర్‌ హిట్‌ చేశారు. ఈ పథకానికి రూ.2వేల కోట్లు వెచ్చిస్తున్నారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 మందిని ఉపాధ్యాయులుగా భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అలాగే పెట్టుబడులను ఆకర్షించడం.. పరిశ్రమలను స్థాపించడం ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 15నెలల కాలంలో రూ.10లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందాలను కుదుర్చుకుంది. వీటిద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.


అన్ని వర్గాలకూ అండగా..

బీసీలను ఆర్థికంగా, సామాజికంగా రాజకీయంగా ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు అమలు చేస్తోంది. చేతివృత్తులు, కులవృత్తులకు అండగా నిలిచేందుకు అన్ని వర్గాలకు కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను గత ప్రభుత్వం 24 శాతానికి తగ్గిస్తే కూటమి ప్రభుత్వం తిరిగి 34 శాతానికి పెంచేందుకు కసరత్తు చేస్తోంది. బీసీల గృహనిర్మాణానికి అదనంగా రూ.50 వేలు, బీసీల ఇళ్లపై 3 కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌టాప్‌ ఏర్పాటుకు రూ.98 వేల సబ్సిడీ అందిస్తోంది. దేవాయాల్లో పనిచేస్తున్న నాయీబ్రాహ్మణులకు కనీస వేతనాన్ని 25వేలకు పెంచింది. ఈ వర్గాలకు దేవాలయ ట్రస్టు బోర్డుల్లో చోటు కల్పించాలని నిర్ణయించింది. 40వేల సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇస్తోంది. కల్లుగీత కార్మికులకు 10శాతం మద్యం దుకాణాలు, బార్‌లు కేటాయించింది. మత్స్యకారులకు వేట విరామ సమయంలో 20 వేల చొప్పున ఆర్థిక సాయం ఇస్తోంది. మత్స్యకారుల సేవలో పథకం ద్వారా 1,29,178 మందికి రూ.259 కోట్లను అందించింది. చేనేతకు అండగా హ్యాండ్లూమ్స్‌కు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. చేనేత ఉత్పత్తులకు జీఎస్టీ 5శాతం రీయింబర్స్‌మెంట్‌ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. నేతన్న భరోసా కింద చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల సాయాన్ని అందించాలని సంకల్పించింది. వడ్డెరలకు మైనింగ్‌ లీజుల్లో 10శాతం కేటాయింపు, కురబలకు, యాదవులకు సబ్సిడీలో గొర్రెలు, మేకలు, పశువులు అందించి ఉపాధి కల్పిస్తోంది.

ఎస్సీ వర్గీకరణతో వారి దశాబ్దాల ఆకాంక్షను నెరవేర్చింది. ఏజెన్సీ ప్రాంతాల్లో అడవితల్లి బాటలో కార్యక్రమం ద్వారా రూ.1,000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టింది. ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5వేలు చొప్పున గౌరవవేతనం ఇస్తోంది. హజ్‌ యాత్రికులకు ఒక్కొక్కరికి రూ.లక్ష సాయం అందిస్తోంది. 8,427 మంది పాస్టర్లకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం అందిస్తోంది. అర్చకుల వేతనాలను రూ.15 వేలు చేసింది. ధూపదీప నైవేద్యాలకు ఆలయానికి రూ.10 వేలు చొప్పున చెల్లిస్తోంది. ఇక వేద విద్యార్థులకు రూ.3వేల స్టైఫండ్‌ అందిస్తోంది.


yj.jpg

అందరికీ ఆరోగ్య సేవ..

పేదవాడి ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 204 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ.5కే భోజనం అందిస్తోంది. ఇప్పటి వరకు 5.6 కోట్ల భోజనాలు అన్నార్తుల కడుపు నింపాయి. ఇక రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్యధీమా కల్పిస్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ప్రజలకు సంజీవనిగా మారనుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా.. పేద ధనిక తారతమ్యం లేకుండా 5 కోట్లమంది ప్రజలకు వర్తింపజేస్తూ యూనివర్సిల్‌ హెల్త్‌ పాలసీ అమలుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.25 లక్షల వరకూ వైద్యచికిత్సలు ఉచితంగా చేయించుకునేందుకు ఆస్కారం కల్పించింది. ఏడాదిలోనే నీటిపారుదల రంగంలో అద్భుత ఫలితాలు సాధించింది. హంద్రీ-నీవా కాలువ విస్తరణ ద్వారా రాయలసీమ చివరి భూములకు తొలిసారి సాగునీరు అందించింది.

Updated Date - Sep 08 , 2025 | 04:06 AM