పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని విద్యార్థిని ఆత్మహత్య
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:39 AM
పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉంగుటూరు మండలం ఆత్కూరులో మంగళవారం జరిగింది.

- ఉంగుటూరు మండలం ఆత్కూరులో ఘటన
ఉంగుటూరు, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉంగుటూరు మండలం ఆత్కూరులో మంగళవారం జరిగింది. ఎస్ఐ చావా సురేష్ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మొగల్ వహీదాబీ(19) డిప్లొమా మూడో సంవత్సరం చదువుతుంది. వహీదాబీ తండ్రి అనారోగ్యంతో ఐదేళ్ల క్రితమే మరణించగా, ప్రస్తుతం తల్లి, తమ్ముడుతో కలిసి ఉంటుంది. ఇటీవల తల్లికి అనారోగ్యంగా ఉండటంతో ఆమె ఏ పనికి వెళ్లలేక ఇంటిపట్టునే ఉంటోంది. సోమ వారం విడుదలైన రెండవ సంవత్సర ఫలితాల్లో వహీదాబీ నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యింది. దీంతో మనస్తాపం చెందిన ఆమె మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తమ్ముడు ఫ్యాన్కు వేలాడుతున్న అక్కను చూసి భయంతో ఏడుస్తుండడంతో చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో వహిదాబీని కిందికి దించి అంబులెన్సులో గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.