Student Assembly: నేడే స్టూడెంట్ అసెంబ్లీ
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:38 AM
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వినూత్నంగానిర్వహిస్తున్న ‘విద్యార్థుల అసెంబ్లీ’ బుధవారం అసెంబ్లీ ఆవరణలో జరగనుంది.
ప్రత్యక్షంగా వీక్షించనున్న సీఎం, మంత్రులు
నాయకత్వ లక్షణాలు పెంచడమే లక్ష్యం
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వినూత్నంగానిర్వహిస్తున్న ‘విద్యార్థుల అసెంబ్లీ’ బుధవారం అసెంబ్లీ ఆవరణలో జరగనుంది. శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన నమూనా అసెంబ్లీ దీనికి వేదిక కానుంది. 8, 9, 10 తరగతుల విద్యార్థులను నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఎంపిక చేశారు. వారితో మంగళవారం వేదికపై ప్రాక్టీస్ చేయించారు. మొత్తం 175 మంది విద్యార్థులు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తారు. ఉదయం 9.30 గంటలకు ప్రొటెం స్పీకర్గా ఒకరు అసెంబ్లీని ప్రారంభిస్తారు. అనంతరం, స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. సీఎం, ప్రతిపక్ష నేత, మంత్రులుగా విద్యార్థులు వ్యవహరిస్తారు. ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ తర్వాత సోషల్ మీడియా వినియోగం, పర్యావరణ పరిరక్షణ అంశాలపై బిల్లులు పెట్టి చర్చిస్తారు. సుమారు 2 గంటల పాటు విద్యార్థుల అసెంబ్లీ జరిగేలా పాఠశాల విద్యాశాఖ కార్యాచరణను రూపొందించింది. ఈ అసెంబ్లీకి సీఎం, మంత్రులు హాజరుకానున్నారు. సభ అనంతరం విద్యార్థులను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగిస్తారు. ఆ తర్వాత విద్యార్థులతో గ్రూప్ ఫొటో దిగుతారు. విద్యార్థులను అసలు అసెంబ్లీ హాలు సందర్శనకు తీసుకెళ్తారు. అనంతరం ‘చిన్నారుల భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరిస్తారు.