Panchayat Audit: పకడ్బందీగా పంచాయతీ ఆడిట్
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:03 AM
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్...
గ్రామాల్లో ఆర్థిక అవకతవకలకు చెక్..
హోటళ్లు, ప్రైవేటు స్థలాల్లో ఆడిట్ చేస్తే చర్యలు
విధివిధానాలు సిద్ధం చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు తీసుకుంది. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూళ్లు పారదర్శకంగా జరిగేందుకు సరికొత్త సాఫ్ట్వేర్ను రూపొందించారు. పన్నుల చెల్లింపులన్నీ పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. పన్నుల సొమ్ముతోపాటు కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా పంచాయతీలు సద్వినియోగం చేసుకునేలా పకడ్బందీ వ్యవస్థను రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ భావించింది. ప్రతి పైసా సద్వినియోగం అయ్యేలా ఆడిట్ నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు పంచాయతీల్లో ఆడిట్ నిర్వహించే స్టేట్ ఆడిట్ అధికారులు, పంచాయతీ ఆడిట్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు ఎస్ఐఆర్డీలో ఇటీవల పంచాయతీరాజ్శాఖ అధికారులు శిక్షణ ఇచ్చారు. విధివిధానాలు కూడా రూపొందిస్తున్నారు.
లోపభూయిష్టమైన ఆడిట్ వ్యవస్థ
గ్రామ పంచాయతీ ఆడిట్ నిర్వహణ లోపభూయిష్టంగా ఉంది. కేంద్రం ఇచ్చిన నిధులే కాకుండా, ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల సొమ్ముకూడా పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు, ఆడిట్ అధికారులు, డీపీవో, డీఎల్పీవో, ఈఓపీఆర్ఆర్డీలు.. అంతాకలిసి పంచేసుకుంటున్నారు. కోస్తా జిల్లాల్లో అత్యధిక ఆదాయ వనరులున్న పంచాయతీల్లో అవినీతి తాండవిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని మేజర్ పంచాయతీల్లో రూ.కోట్లు దుర్వినియోగం అయ్యాయి. రాజమండ్రి రూరల్లోని పలు పంచాయతీల్లో రూ.కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఒక ఆడిట్ అధికారి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాల్లేవు. పైగా రీ ఆడిట్కు ఆదేశించిన ఆ ఆడిట్ అధికారిని పంచాయతీ కార్యదర్శులందరూ ఏకమై బదిలీ చేయించారు.
ఆడిట్ సక్రమ నిర్వహణకు నిబంధనలు
గ్రామ పంచాయతీల ఆడిట్ ఇప్పటివరకూ హోటళ్లలోను, అతిథి గృహాల్లోనూ నిర్వహించేవారు. ఒక్కో పంచాయతీకి ఒక రేటు నిర్ణయించి ఆడిట్ అధికారులకు సమర్పించడం ఆనవాయితీగా ఉంది. ఇందులో గ్రామ పంచాయతీల నుంచి జీఎ్సటీ కూడా చెల్లించడం లేదు. దీంతో హోటళ్లు, అతిథిగృహాల్లో ఆడిట్ నిర్వహించే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. గ్రామ పంచాయతీల్లో ఆడిట్ను రాష్ట్రస్థాయి అధికారులే పర్యవేక్షిస్తున్నారు. వారు ఆర్థిక శాఖ పరిధిలో ఉండటంతో వారి అడ్డగోలు వ్యవహారాలకు అడ్డూ అదుపూలేకుండా పోతోంది. తప్పుడు ఆడిట్ నిర్వహించే రాష్ట్ర ఆడిట్ అధికారులపై చర్యలు తీసుకునేలా పంచాయతీరాజ్ అధికారులు ఆర్థిక శాఖకు సిఫార్సులు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.