Executive Committee Resolution: ఏపీ ఎన్జీవో మహిళా విభాగాన్ని బలోపేతం చేయాలి
ABN , Publish Date - Jul 28 , 2025 | 05:24 AM
ఏపీ ఎన్జీవో రాష్ట్ర మహిళా విభాగాన్ని తాలూకా స్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆ విభాగ రాష్ట్ర చైర్పర్సన్ వి.నిర్మలాకుమారి, కన్వీనర్ పి.మాధవి పిలుపునిచ్చారు.
ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో తీర్మానం
విజయవాడ (గాంధీనగర్), జూలై 27 (ఆంధ్రజ్యోతి) : ఏపీ ఎన్జీవో రాష్ట్ర మహిళా విభాగాన్ని తాలూకా స్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయిలో బలోపేతం చేయాలని ఆ విభాగ రాష్ట్ర చైర్పర్సన్ వి.నిర్మలాకుమారి, కన్వీనర్ పి.మాధవి పిలుపునిచ్చారు. విజయవాడ గాంధీనగర్లోని ఎన్జీవో హోంలో సంఘ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల సమస్యలు, వేతనాలు, పెండింగ్ అంశాలు, విధుల నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లు.. తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైల్డ్కేర్ లీవ్లను సద్వినియోగం చేసుకునే విషయంలో...జీవోలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలను సవరించాలని, స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. మహిళా విభాగాన్ని పటిష్టపరిచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తీర్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులకు జూమ్ సమావేశాల నుంచి మినహాయింపు ఇవ్వాలని, వారిపై పనిభారాన్ని తగ్గించాలని, పని ప్రదేశాల్లో ప్రత్యేక టాయిలెట్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు.