Nara Lokesh: హద్దు దాటొద్దు
ABN , Publish Date - Aug 01 , 2025 | 06:05 AM
శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ వద్ద బీసీ సంక్షేమ మంత్రి సవిత అనుచరులు కాంట్రాక్టుల కోసం...
పారిశ్రామిక అనుకూల వాతావరణం చెడగొట్టొద్దు
మంత్రి సవితపై లోకేశ్ సీరియస్
నంద్యాల ఘటనపైనా ఆరా
అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ వద్ద బీసీ సంక్షేమ మంత్రి సవిత అనుచరులు కాంట్రాక్టుల కోసం హడావుడి చేయడాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్రంగా పరిగణించారు. ఇలాంటి చర్యలతో రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూల వాతావరణానికి విఘాతం ఏర్పడుతుందని, ఇలాంటివి పునరావృతమైతే ఎంతటివారినైనా ఉపేక్షించేంది లేదని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలను ఎవరు భయపెట్టాలని చూసినా కఠిన చర్యలు తప్పవన్నారు. అలాగే.. నంద్యాల జిల్లాలో కొలిమిగుండ్ల లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా విధుల్లో ఉన్న కానిస్టేబుల్పై మంత్రి బీసీ జనార్దన్రెడ్డి బంధువు దాడి చేసిన వ్యవహారంపైనా లోకేశ్ ఆరా తీశారు. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు, వారి బంధువులు బాధ్యతగా మెలగాలని.. సంయమనం కోల్పోయి వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవని ఆయన స్పష్టం చేశారు.