పోలీసులకు అత్యాధునిక శిక్షణ
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:34 AM
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులకు అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనక ళ్ల నారాయణరావు, శాసన సభ్యులతో కలిసి మచిలీపట్నం మండలం చినకరగ్రహారం గ్రామంలో జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
- హోంమంత్రి వంగలపూడి అనిత
- కరగ్రహారంలో జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన
మచిలీపట్నం, జూలె 17 (ఆంధ్రజ్యోతి): శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులకు అత్యాధునిక శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. గురువారం మంత్రి కొల్లు రవీంద్ర, ఆర్టీసీ చైర్మన్ కొనక ళ్ల నారాయణరావు, శాసన సభ్యులతో కలిసి మచిలీపట్నం మండలం చినకరగ్రహారం గ్రామంలో జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఎందరో మహానుభావులకు పుట్టినిల్లు, కళాసంస్కృతులకు నిలయమైన కృష్ణాజిల్లాలో పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ ప్రాంతంలో ఉన్న పోలీస్ శిక్షణ కేంద్రం స్థలాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు తీసుకోవడంతో చినకరగ్రహారంలో 46 ఎకరాలలో అత్యాధునిక వసతులతో ఈ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసుశాఖలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తుందన్నారు. ప్రస్తుతం సైబర్ నేరాలు అధికమయ్యాయని, వాటిని అరికట్టేందుకు కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు ఈ కేంద్రంలో శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర అభ్యర్థన మేరకు ఈ ప్రాంతంలోని మెరైన్ పోలీసులకు కూడా శిక్షణ ఇస్తామని మంత్రి అనిత వివరించారు.
రూ.32 కోట్ల వ్యయంతో నిర్మాణం
మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రూ.32 కోట్ల వ్యయంతో 46 ఎకరాల విస్తీర్ణంలో జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కేంద్రం మచిలీపట్నం నగరానికి మణిహారంగా మారుతుందన్నారు. ఇక్కడ ఎకై్ౖసజ్ శాఖ, మెరైన్ పోలీసులకు కూడా శిక్షణ ఇచ్చే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. త్వరలో పోర్టు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, తీరప్రాంతంలో గంజాయి, ఇతర మత్తుపదార్థాలు రవాణా జరపకుండా నిఘా పెట్టేందుకు మెరైన్ పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హోంమంత్రిని కోరారు. ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్కుమార్, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్, ముడా చైర్మన్ మట్టా ప్రసాద్, గుడివాడ, పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్రాజా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సత్యనారాయణ, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ సీఈ వేణుగోపాలరాజు, ఎస్ఈ బి.సంజయ్సునీల్కుమార్, ఈఈ జి.శ్రీనివాసరావు, డీఈఈ వి.వెంకటరెడ్డి, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కుంచె నాని, బందరు ఆర్డీవో కె.స్వాతి, చినకరగ్రహారం మాజీ సర్పంచ్ నడకుదిటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.