AP Govt: అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యం
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:39 AM
రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా పారిశ్రామికాభివృద్ధిని సాధించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అదనపు ప్రోత్సాహకాలు
స్థానికులకే ఉద్యోగ అవకాశాలు దక్కాలి
ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు
28,546 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
అమరావతి, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రమంతా సమానంగా అభివృద్ధి వికేంద్రీకరణే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆ దిశగా పారిశ్రామికాభివృద్ధిని సాధించేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది. రూ. 28,546 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. వీటితో 30,270 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు పెడితే అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆదేశించారు. యువత నైపుణ్యాభివృద్ధే ప్రధానాంశంగా కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. అభివృద్ధికి చోదకాలుగా పర్యాటకం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మారతాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో స్థాపించబోయే, స్థాపించిన పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, ఉద్యోగావకాశాల వివరాలతో కూడిన ఆన్లైన్ పోర్టల్ను ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ‘రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా విస్తరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. భూములు తీసుకున్న సంస్థలు గడువులోపే కార్యకలాపాలు చేపట్టేలా పర్యవేక్షణ జరగాలి. పర్యాటకం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయి. తీరప్రాంతాల్లో లగ్జరీ బోట్ క్రూయిజ్ షిప్లను ఆపరేట్ చేసేలా సంబంధిత సంస్థలతో టూరిజం శాఖ సంప్రదింపులు జరపాలి. ఆతిథ్యరంగంలో ఒప్పందం చేసుకున్న సంస్థలు త్వరగా నిర్మాణాలు పూర్తిచేసేలా చూడాలి. పారిశ్రామిక పార్కులకు మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలి. ఇకపై ప్రతినెలా రెండు ఎస్ఐపీబీ సమావేశాలు జరగాలి. ఏడాదికి 25 సమావేశాలు జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలి’’ అని అధికారులకు స్పష్టం చేశారు. కాగా, ఇప్పటి వరకూ జరిగిన ఏడు ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ. 5,34,684 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. దీని వల్ల 4,73,969 మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి.
ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులు
రేమండ్ రూ.1201 కోట్ల పెట్టుబడి. 6,571 మందికి ఉద్యోగాలు.
అనంతపురంలో జి.ఇన్ర్ఫా రూ.1,150 కోట్లు.. 229 మందికి ఉద్యోగాలు.
తిరుపతిలో సంగం డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 130 కోట్ల పెట్టుబడి. 400 మందికి ఉద్యోగాలు.
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖపట్నంలో రూ. 1,583 కోట్ల పెట్టుబడితో 8,000 మందికి ఉద్యోగాలు.
తూర్పుగోదావరిలో 3ఎఫ్ ఆయిల్పామ్ ప్రైవేటు లిమిటెడ్ రూ. 224 కోట్లు పెట్టుబడి. 750 మందికి ఉద్యోగాలు.
చిత్తూరులో ఏబీఐఎస్ ప్రొటీన్స్ 350 కోట్ల పెట్టుబడి. 790మందికి ఉద్యోగాలు.
రిలయన్స్ కన్యూమర్స్ ప్రొడక్ట్స్ ఓర్వకల్లులో రూ.1,622 కోట్ల పెట్టుబడి. 1,200 మందికి ఉద్యోగాలు.
ఏలూరులో మెల్గాన్ లైజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ రూ. 225 కోట్లు పెట్టుబడి. 350 మందికి ఉద్యోగాలు.
తిరుపతిలో పావని హోటల్స్ లెమన్ ట్రీ ప్రీమియర్ రూ. 80 కోట్లు పెట్టుబడి. 300 మందికి ఉద్యోగాలు.
సత్యసాయి జిల్లా టెర్రీ ఆల్లోస్.. 573 కోట్లు పెట్టుబడి. 120 మందికి ఉపాధి.
కడపలో చింతా గ్రీన్ ఎనర్జీ రూ. 2,323 కోట్ల పెట్టుబడితో 540 మందికి ఉపాధి.
కడపలో అదానీ రెన్యువబుల్స్ ఎనర్జీ 8,010 కోట్లు.. 3,500 మందికి ఉపాధి.
కొప్పర్తిలో ఛానల్ ఫ్రీ రూ. 80 కోట్లు పెట్టుబడితో 1,100 మందికి ఉపాధి.
అదానీ హైడ్రో ఎనర్జీ వివిధ జిల్లాల్లో రూ. 10,900 కోట్ల పెట్టుబడితో విద్యుత్తు సంస్థల్లో 7,000 మందికి ఉపాధి.
బీపీసీఎల్ అండ్ కేఎ్సఎ్సఎల్, ఎల్జీ ఎలకా్ట్రనిక్స్, కృష్ణపట్నం పవర్ కార్పొరేషన్లో అదనపు పెట్టుబడుల మార్పుల ప్రతిపాదనలకు ఆమోదం.