AP State Government: రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్లకు పదోన్నతులు
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:04 AM
రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. వీరిలో 41 మంది ఐఏఎస్లు, 17 మంది ఐపీఎ్సలు ఉన్నారు.
41 మంది ఐఏఎస్లు, 17 మంది ఐపీఎస్లకు ప్రమోషన్
అమరావతి, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. వీరిలో 41 మంది ఐఏఎస్లు, 17 మంది ఐపీఎ్సలు ఉన్నారు. ఈ మేరకు సీఎస్ విజయానంద్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 1996 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్లు ముద్దాడ రవిచంద్ర, లవ్ అగర్వాల్, శశిభూషణ్ కుమార్, కె.సునీతలకు ముఖ్య కార్యదర్శుల నుంచి ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న రవిచంద్ర ఇకపై అదే స్థానంలో సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉంటారు. కేంద్ర సర్వీసులో ఉన్న లవ్ అగర్వాల్ అక్కడే కొనసాగనున్నారు. పంచాయతీరాజ్, రూరల్ డెవల్పమెంట్ ముఖ్య కార్యదరి శశిభూషణ్కుమార్ అదే విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తారు. ఈడబ్యూఎస్ ముఖ్య కార్యదర్శి కె.సునీత అదే స్థానంలో ఈడబ్యూఎస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారని పేర్కొన్నారు. కేంద్ర సర్వీసులో ఉన్న 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సిద్ధార్థ జైన్ ప్రస్తుతం సెక్రటరీ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. ఇకనుంచి ముఖ్య కార్యదర్శి హోదాలో అక్కడే కొనసాగుతారు. 2010 బ్యాచ్కు చెందిన ఐదుగురు సీనియర్ ఐఏఎస్లు అడిషనల్ సెక్రటరీ నుంచి సెక్రటరీగా పదోన్నతి పొందారు. వీరిలో నారాయణ భరత్ గుప్తా, ఆమ్రపాలి, జె.నివాస్, గంధం చంద్రుడు, సి.నాగరాణి ఉన్నారు. చంద్రుడు మినహా మిగిలిన నలుగురూ సెక్రటరీలుగా యథాస్థానంలో కొనసాగనున్నారు. కార్మిక శాఖలో అడిషనల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న గంధం చంద్రుడికి సెక్రటరీ హోదా కల్పించి, కార్మిక శాఖ కమిషనర్గా నియమించింది. అక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఎం.వి. శేషగిరిబాబును రిలీవ్ చేసింది.
ఈ ఏడాది పదోన్నతి పొందినవారిలో 2013 బ్యాచ్ ఐఏఎస్లు 13 మంది ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది జిల్లాల్లో కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జాయింట్ సెక్రటరీ హోదాలో ఉన్న వీరికి ప్రభుత్వం అడిషనల్ సెక్రటరీగా పదోన్నతి కల్పించింది. వారిలో హిమాన్షు శుక్లా (నెల్లూరు), కృతిక శుక్లా (పల్నాడు), ఎస్.షణ్మోహన్(కాకినాడ), దినేష్ కుమార్ (అల్లూరి సీతారామరాజు), కె.విజయ (అనకాపల్లి), జి. లక్ష్మీశ (ఎన్టీఆర్), ఎన్.ప్రభాకర్రెడ్డి (పార్వతీపురం మన్యం), పి.రాజాబాబు (ప్రకాశం) ఉన్నారు. మరికొంత మంది హెచ్వోడీలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇక 2017 బ్యాచ్కు చెందిన 10మంది ఐఏఎస్లు డిప్యూటీ సెక్రటరీ నుంచి జాయింట్ సెక్రటరీలుగా పదోన్నతులు పొందారు. అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో ఉన్న 2022 బ్యాచ్కు చెందిన మరో 8 మందికి ప్రభుత్వం డిప్యూటీ సెక్రటరీ హోదా కల్పించింది.
పదోన్నతి పొందిన ఐఏఎస్లు వీరే...
ఏపీ కేడర్ 17మంది ఐపీఎస్లకు పదోన్నతి లభించింది. ఏడీజీ ర్యాంకులో ఉన్న శంకబ్రత్ బాగ్చి(విశాఖ సీపీ)కి డీజీపీ స్థాయి.. కేంద్ర సర్వీసుల్లో ఉన్న వినీత్ బ్రిజిలాల్కు ఏడీజీ ర్యాంకు, విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టితో పాటు సెంథిల్ కుమార్, షేముషి బాజ్పాయ్కి ఐజీ హోదాతో ప్రమోషన్ ఇస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు ఇచ్చింది. గజరావ్ భూపాల్(తెలంగాణ సర్వీస్), గ్రేవల్ నవ్దీప్ సింగ్(కేంద్ర సర్వీసుల్లో)కు పదోన్నతి ఇస్తూనే.. రాష్ట్ర కేడర్కు తిరిగి వచ్చాకే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్కు డీఐజీగా పదోన్నతి దక్కింది. ఇక 9మంది ఎస్పీ స్థాయి అధికారులకు సీనియర్ స్కేల్ హోదా కల్పించారు. వీరిలో అద్నాన్ నయీమ్ హస్మి, ఐశ్వర్య రస్తోగి, ఏఆర్ దామోదర్, హర్షవర్ధన్ రాజు, నరసింహ కిశోర్, రవిశంకర్ రెడ్డి, గంగాధర్ రావు, గీతా దేవి, మేరీ ప్రశాంతి ఉన్నారు.