Bapatla : ప్రాణం తీసిన అతివేగం
ABN , Publish Date - Nov 07 , 2025 | 04:55 AM
అది.. బాపట్లలోని గడియారస్తంభం నాలుగురోడ్ల కూడలి. తెల్లవారుజాము కావడంతో రోడ్డంతా నిర్మానుషంగా ఉంది. అటుగా వెళ్తున్న ఓ లారీ సరిగ్గా కూడలి మధ్యలోకి వచ్చింది.
బాపట్లలో ఇద్దరు యువకుల దుర్మరణం
బైక్పై వెళ్తూ కూడలిలో లారీకి ఢీ
బాపట్ల, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): అది.. బాపట్లలోని గడియారస్తంభం నాలుగురోడ్ల కూడలి. తెల్లవారుజాము కావడంతో రోడ్డంతా నిర్మానుషంగా ఉంది. అటుగా వెళ్తున్న ఓ లారీ సరిగ్గా కూడలి మధ్యలోకి వచ్చింది. ఇంతలో మరో రోడ్డులో కూడలి వైపు బైక్పై అతివేగంగా వచ్చిన ఇద్దరు యువకులు నేరుగా లారీని ఢీకొట్టారు. వారిద్దరు బైక్పై నుంచి ఎగిరిపడి అక్కడికక్కడే మరణించారు. గుంటూరు కొరిటెపాడుకు చెందిన షేక్ రిజ్వాన్ (18), చింతల యశ్వంత్ (21) బుధవారం రాత్రి సూర్యలంక సముద్రతీరానికి వెళ్లారు. అక్కడ అనుమతి లేకపోవటంతో వెనక్కి బయల్దేరారు. గురువారం తెల్లవారుజామున బాపట్లలో ప్రమాదానికి గురయ్యారు. గడియారస్తంభం కూడలిలో చీరాల నుంచి వస్తున్న లారీని వీరి బైక్ బలంగా ఢీకొట్టింది. యశ్వంత్ గుంటూరులోని వస్త్రదుకాణంలో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. రిజ్వాన్ గుంటూరులో ఐటీఐ విద్యార్థి. మృతదేహాలను బాపట్ల ఏరియా వైద్యశాలకు తరలించారు. బాపట్ల పట్టణ సీఐ ఆర్ రాంబాబు పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకుల మరణవార్తతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.