Nandyal District : ఆస్తి రాయలేదని.... అమ్మను చంపేశాడు!
ABN , Publish Date - Mar 11 , 2025 | 06:15 AM
వృద్ధాప్యంలో ఉన్న తల్లిని సంరక్షించాల్సిన కొడుకే ఆమె ప్రాణం తీశాడు. ఆస్తికోసం, డబ్బుకోసం రోకలిబండతో తలపై కొట్టి హత్యచేశాడు.

నంద్యాల జిల్లాలో దారుణం
ఉయ్యాలవాడ, మార్చి 10(ఆంధ్రజ్యోతి): వృద్ధాప్యంలో ఉన్న తల్లిని సంరక్షించాల్సిన కొడుకే ఆమె ప్రాణం తీశాడు. ఆస్తికోసం, డబ్బుకోసం రోకలిబండతో తలపై కొట్టి హత్యచేశాడు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడకు చెందిన అంబటి చిన్న పుల్లమ్మకు(75) కుమారుడు, కుమార్తె, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. వృద్ధురాలు చుట్టు పక్కల గ్రామాల్లో సున్నం అమ్ముకుంటూ జీవనం సాగిస్తుండేది. కుమారుడు బాల గుర్రప్ప మద్యానికి బానిసై డబ్బు కోసం తల్లిని, భార్యను వేధించేవాడు. అతని వేధింపులు తాళలేక పదేళ్ల క్రితం భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి జులాయిగా తిరుగుతూ తల్లిని వేధిస్తూ ఉండేవాడు. ఇటీవల వృద్ధురాలు తన ఇంటిని తన మనవ డు శివశంకర్ పేరుమీద రాయించింది. దీంతో ఆస్తిని తన పేరుమీద రాయించాలని గుర్రప్ప తల్లితో గొడవపడేవాడు. సోమవారం ఉదయం వృద్ధురాలు వంట చేస్తుండగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. నిరాకరించడంతో పక్కనే ఉన్న రోకలిబండతో తలపై బలంగా కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. పుల్లమ్మ అల్లుడు రమణయ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు.