Somi Reddy: పేర్ని, ప్రసన్న మాటలన్నీ జగన్ స్క్రిప్ట్
ABN , Publish Date - Jul 15 , 2025 | 05:36 AM
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో అన్ని వ్యవస్థలు గాడినపడుతున్నాయి. కానీ వైసీపీ, జగన్ దుర్మార్గపు చర్యల వలన రాజకీయాలు రోడ్డును పడుతున్నాయి అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో అన్ని వ్యవస్థలు గాడినపడుతున్నాయి. కానీ వైసీపీ, జగన్ దుర్మార్గపు చర్యల వలన రాజకీయాలు రోడ్డును పడుతున్నాయి’ అని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కూటమి పాలనలో కక్ష సాధింపులు ఉండవు. తప్పు చేస్తే మాత్రం ఫలితం అనుభవిస్తారు. పేర్ని నాని, ప్రసన్నకుమార్ రెడ్డి నోటి వెంట వచ్చే ప్రతి మాటా జగన్ స్ర్కిప్టే. 40 ఏళ్లకే నా పని అయిపోందని కొడుక్కి పగ్గాలు అప్పజెప్పిన వ్యక్తి పేర్ని. అలాంటి వ్యక్తి చంద్రబాబుకి వయసు అయిపోయిందని విమర్శించడం హాస్యాస్పదం. చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ఆయన తక్షణం క్షమాపణలు చెప్పాలి’ అని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. కాగా, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా మాట్లాడుతూ ‘వైసీపీ నాయకులు చేసిన తప్పులు, అవినీతి ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. పామర్రు ప్రశాంతమైన నియోజకవర్గం. అలాంటి చోట పేర్ని అశాంతిని రగల్చడానికి ప్రయత్నిస్తున్నారు’ అని కుమార్ రాజా దుయ్యబట్టారు.