Nellore Police: నెల్లూరులో జంట హత్యల కలకలం
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:54 AM
నెల్లూరులో మంగళవారం జంట హత్యలు వెలుగు చూశాయి. పోలీసుల కథనం మేరకు.. పెన్నా బ్యారేజీ సమీపంలో తిక్కన పార్కు ఎదుట రక్తం ధారలుగా ఉందని, జాఫర్ కాలువలో ఓ మృతదేహం...
విచక్షణారహితంగా కొట్టి.. కాలువలో పడేసిన ఆగంతకులు
స్థానికుల సమాచారంతో మృతదేహాల వెలికితీత
నెల్లూరు (క్రైం), అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): నెల్లూరులో మంగళవారం జంట హత్యలు వెలుగు చూశాయి. పోలీసుల కథనం మేరకు.. పెన్నా బ్యారేజీ సమీపంలో తిక్కన పార్కు ఎదుట రక్తం ధారలుగా ఉందని, జాఫర్ కాలువలో ఓ మృతదేహం ఉన్నట్టు నెల్లూరు నగరంలోని సంతపేట పోలీసులకు మంగళవారం ఉదయం ఫోన్ వచ్చింది. వెంటనే ఇన్స్పెక్టర్ దశరథ రామారావు ఘటనా స్థలాన్ని పరిశీలించి జాఫర్ సాహెబ్ కాలువలోని మృతదేహాన్ని వెలికి తీశారు. అదే కాలువలో వంద మీటర్ల రూపంలో మరో మృతదేహాన్ని పోలీసులు గుర్తించి బయటకు తీశారు. మృతుల్లో ఒకరు బాపట్ల ప్రాంతానికి చెందిన సంచార జీవి ఎం.పోలయ్యగా గుర్తించారు. తన రెండవ భార్య లక్ష్మితో కలిసి పెన్నా నదిలో ఓ చిన్న గుడారం వేసుకొని పోలయ్య జీవిస్తున్నాడు. మరో మృతుడిని కూడా సంచార జీవి శివగా పోలీసులు గుర్తించారు. పెన్నా నదిలో చేపలు పట్టుకునే వారిని ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉండే స్థానికులు మాత్రం నదిలో గంజాయి సేవించే వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని, గంజాయి మత్తు లో చేపల వేటకు వెళుతున్న వారిపై దాడి చేసి హత్య చేసి ఉంటారని చెబుతున్నారు. మరోవైపు దాడి చేసిన ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా పనిచేయట్లేదు. ఐదుగురికిపైగా ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.