ACB Court: ఫైబర్నెట్ కేసులో గౌతంరెడ్డికి చుక్కెదురు
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:35 AM
ఫైబర్నెట్ కార్పొరేషన్ కేసులో వైసీపీ నేత, ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పి.గౌతంరెడ్డికి చుక్కెదురైంది.
విజయవాడ, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఫైబర్నెట్ కార్పొరేషన్ కేసులో వైసీపీ నేత, ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పి.గౌతంరెడ్డికి చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హత లేదని విజయవాడ ఏసీబీ కోర్టు స్పష్టంచేసింది. ఆయన వ్యాజాన్ని కొట్టివేసింది. ఈ మేరకు న్యాయాధికారి పి.భాస్కరరావు గురువారం ఉత్తర్వులిచ్చారు. ఫైబర్నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని చంద్రబాబుతోపాటు మరికొందరిపై జగన్ ప్రభుత్వ హయాంలో సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని సీఐడీ అధికారులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. కేసును ఉపసంహరించుకుంటున్నట్లు ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న అప్పటి ఎండీ మధుసూదన్రెడ్డి కొద్దిరోజుల క్రితమే కోర్టులో అఫిడవిట్ వేశారు. ఈ నేపథ్యంలో తీర్పు ఇచ్చేముందు తన వాదనలు వినాలంటూ గౌతంరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణార్హతపై రెండ్రోజుల కిందట వాదప్రతివాదనలు ముగిశాయి. న్యాయాధికారి ఆ పిటిషన్ను తిరస్కరిస్తూ గురువారం తీర్పు ఇచ్చారు.