Heatwaves: పడమర నుంచి పొడిగాలులు
ABN , Publish Date - Jun 22 , 2025 | 04:15 AM
నైరుతి రుతుపవనాలు మందగించడంతో రాష్ట్రంపైకి పడమర దిశ నుంచి పొడిగాలులు వీస్తున్నాయి.
మరోసారి వేసవి ఎండలు, ఉక్కపోత
రానున్న రెండు రోజులు ఇదే వాతావరణం
విశాఖపట్నం, జూన్ 21(ఆంధ్రజ్యోతి): నైరుతి రుతుపవనాలు మందగించడంతో రాష్ట్రంపైకి పడమర దిశ నుంచి పొడిగాలులు వీస్తున్నాయి. దాంతో శనివారం వేసవి మాదిరి ఎండలు, ఉక్కపోత కొనసాగాయి. రుతుపవనాలు ప్రవేశించాక కూడా వేడి వాతావరణం నెలకొంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. శనివారం జంగమహేశ్వరపురంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అయితే సాయంత్రంపూట రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. రానున్న రెండురోజుల్లో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత, ఉక్కపోత కొనసాగుతాయని, చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా, ఈనెల 25వ తేదీ నాటికి పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఆవరిస్తుందని పేర్కొంది.