ఊడిన పాఠశాల పెచ్చులు
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:43 AM
పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో నలుగురు విద్యార్థులు గాయపడిన సంఘటన బుధవారం ఆలూరు మండలంలో చోటు చేసుకుంది.
నలుగురు విద్యార్థులకు గాయాలు
ఆలూరు రూరల్, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడటంతో నలుగురు విద్యార్థులు గాయపడిన సంఘటన బుధవారం ఆలూరు మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా... ఆలూరు పట్టణంలోని 4వ వార్డులో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గత కొంత కాలంగా పాఠశాల పైకప్పునకు పెచ్చులు ప్రమాకరంగా మారాయి. ఈ క్రమంలో బుధవారం నాలుగో తరగతి గదిలో నలుగురు విద్యార్థులపై పెచ్చులు పడటంతో వారి తలలకు బలమైన గాయాలయ్యాయి. మధ్యాహ్నం భోజన సమయంలో తరగతి గదిలో కూర్చున్న నిత్య, జయశ్రీ, చరణ్, విఘ్నేష్లపై పెచ్చులు ఊడిపడ్డాయి. దీంతో రక్తగాయాలైన విద్యార్థులను ఉపాధ్యాయులు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మధ్యాహ్న భోజన సమయం కావడంతో పెను ప్రమాదం తప్పింది. కొంతమంది విద్యార్థులు భోజనం కోసం పాఠశాల ఆరుబయటకు వచ్చారు. ఇదిలా ఉండగా పాఠశాలలో గత వైసీపీ ప్రభుత్వంలో నాడు-నేడు పనులను చేపట్టారు. ఆ పనుల్లో నాణ్యత వల్లే కనీం మూడేళ్లు తిరగకుండానే ఇలా పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడిపడి విద్యార్థులు గాయపడ్డారని స్థానికులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాడు-నేడు పనుల్లో అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు విలేకరులకు తెలిపారు.