Anti Drug Campaign: మాదకద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు!
ABN , Publish Date - Dec 17 , 2025 | 06:17 AM
గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని వీటి ని ర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్జెట్టి పిలుపునిచ్చారు.
శ్రీకాకుళంలో ఉత్సాహంగా ‘అభ్యుదయం సైకిల్ యాత్ర’
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని వీటి ని ర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్జెట్టి పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీకాకుళంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘అభ్యుదయం సైకిల్యాత్ర’ విజయవంతంగా నిర్వహించారు. డీఐజీతోపాటు కలెక్టర్ స్వప్నిల్దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, అధిక సంఖ్యలో విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మునిసిపల్ హైస్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో డీఐజీ మాట్లాడుతూ.. ‘గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి. మంచి సమాజ నిర్మాణం మంచి వ్యక్తుల వల్లనే సాధ్య మవుతుంది. గంజాయిని తరిమిక్టొడానికి సమష్టి ప్రయత్నం కొనసాగించాలి’ అని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు వద్దు.. జీవితమే ముద్దు అంటూ ప్రతిజ్ఞ చేయించారు. జానపద నృత్యాలు, తప్పెటగుళ్ల ప్రదర్శనలు, యముడు, తదితర వేషధారణలతో డ్రగ్స్ను వ్యతిరేకిస్తూ అవగాహన కల్పించారు.