Sajjala Ramakrishna Reddy: కమీషన్ల కోసమే వైద్య కళాశాలల ప్రైవేటీకరణ
ABN , Publish Date - Dec 18 , 2025 | 04:51 AM
కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని వైసీపీ రాజకీయ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.
వెంటనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి: సజ్జల
అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): కమీషన్ల కోసమే చంద్రబాబు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తున్నారని వైసీపీ రాజకీయ సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 175 నియోజకవర్గాల నుంచి కోటి సంతకాలను సేకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సంతకాలతో కూడిన పత్రాలను బుధవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. వాటిని పరిశీలించిన అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వ నిర్ణయాన్ని కోటి మంది ప్రజలు వ్యతిరేకించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం ద్వారా పేదవాడి ఉసురును చంద్రబాబు తీశారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలి’ అని సజ్జల డిమాండ్ చేశారు.