Sajjala Rama Krishna Reddy: ఎన్నికల ముందు డబ్బులు ఇంతకాలం ఉన్నాయా?
ABN , Publish Date - Aug 02 , 2025 | 05:46 AM
‘కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఎన్నికలకు ముందు ఫామ్హౌస్లో దాచిన డబ్బులు ఇప్పటి వరకూ ఉన్నాయా? అసలు కుంభకోణం ఎక్కడ జరిగిందో అర్థం కావడం లేదు’ అని వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ...
ప్రజల దృష్టిని మరల్చడానికే మాపై కేసులు పెడుతోంది: సజ్జల
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): ‘కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి ఎన్నికలకు ముందు ఫామ్హౌస్లో దాచిన డబ్బులు ఇప్పటి వరకూ ఉన్నాయా? అసలు కుంభకోణం ఎక్కడ జరిగిందో అర్థం కావడం లేదు’ అని వైసీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలో లిక్కర్ స్కామ్ నిందితులను పరామర్శించేందుకు శుక్రవారం వైసీపీ నేతలతో వెళ్లిన ఆయన ఆ తరువాత మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం పాలనలో ఘోరంగా విఫలమైంది. ఏపీలో ఒక సీఎం, ఇద్దరు డీసీఎంలు ఉన్నారు. ఇద్దరిలో ఒక డీసీఎం డిప్యూటీ సీఎంగా ఉంటే... మరొకరు డీఫ్యాక్టో సీఎంగా ఉన్నారు. వారెవ్వరికీ ప్రజా సమస్యలు పట్టడం లేదు. లిక్కర్ స్కామ్ ఎక్కడ జరిగింది? అసలు జరగని కుంభకోణంలో అరెస్టులు ఏమిటి? ఈ పేరుతో ప్రజల దృష్టిని మరల్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రజల్లోకి జగన్ వెళ్లకుండా అడ్డుకోవడానికి ఏదో ఒక డైవర్షన్ చేస్తున్నారు. సీజ్ చేశామని చెబుతున్న రూ.11కోట్లు ఎవరివి? అతని స్టేట్మెంట్ రికార్డు చేశారా? ఏపీఎండీసీలో స్కామ్ జరిగిందంటూ ప్రభుత్వం కొత్తరాగం అందుకుంది’ అని సజ్జల అన్నారు.