రుషికొండ భవనాలు పర్యాటకానికే: పల్లా
ABN , Publish Date - Dec 29 , 2025 | 04:20 AM
రుషికొండపై గత ప్రభుత్వం భవనాలు నిర్మించిన భూమి పర్యాటక శాఖకు చెందినదని, అందువల్ల వాటిని పర్యాటక రంగానికి వినియోగించడమే సముచితమని...
విశాఖపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రుషికొండపై గత ప్రభుత్వం భవనాలు నిర్మించిన భూమి పర్యాటక శాఖకు చెందినదని, అందువల్ల వాటిని పర్యాటక రంగానికి వినియోగించడమే సముచితమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘విలాసవంతమైన ఈ భవనాల నిర్వహణ వ్యయం అధికంగా ఉంటుంది. ఇందుకు తగ్గట్టుగా ఆదాయం రాకపోతే దీని సంరక్షణ ప్రభుత్వానికి భారం మారుతుంది. హోటల్ లేదా రిసార్ట్ తరహా ప్రాజెక్టుగా లీజుకు ఇవ్వడం లేదా నిర్వహణ భారం ప్రభుత్వంపై పడకుండా ఉండడానికి ప్రైవేటు సంస్థను భాగస్వామిగా చేసుకోవడం మినహా మరో మార్గం లేదు. ఈ భవనాల వినియోగంపై నియమించిన క్యాబినెట్ సబ్కమిటీ నివేదికను సమర్పించిన అనంతరం ఎమ్మెల్యేలతో చర్చలు జరిపి, అందరి అభిప్రాయాలనూ పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది’ అని పల్లా తెలిపారు. రుషికొండ భవనాలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు వ్యక్తం చేసిన అభిప్రాయం ఆయన వ్యక్తిగతమని పేర్కొన్నారు.