Chairman Konakalla Narayana: ఆర్టీసీ పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:15 AM
ఆర్టీసీని పరిరక్షించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగుల వేస్తోందని ప్రజా రవాణా సంస్థ(ఏపీపీటీడీ) చైర్మన్ కొనకళ్ల నారాయణ అన్నారు.
కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం
ఎన్ఎంయూఏ మహాసభల్లో ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ
విజయవాడ సిటీ, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీని పరిరక్షించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగుల వేస్తోందని ప్రజా రవాణా సంస్థ(ఏపీపీటీడీ) చైర్మన్ కొనకళ్ల నారాయణ అన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ప్రాధాన్యతా క్రమంలో కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. స్ర్తీ శక్తి పథకం అమలులో ఉద్యోగులు, కార్మికులు, అధికారులు చేస్తున్న సహకారాన్ని కొనియాడారు. విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియంలో నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ (ఎన్ఎంయూఏ) ద్వితీయ మహాసభలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సభలకు చైర్మన్ కొనకళ్ల ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికులు కీలక భాగస్వాములయ్యారని, కార్మికుల కృషి, సహకారం లేనిదే ప్రజా రవాణా వ్యవస్థ ఒక్క అడుగు ముందుకు వేయలేదని తెలిపారు. ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారంలో ఎన్ఎంయూ నాయకులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ పీటీడీ ఉద్యోగుల సమస్యలను సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాల జేఏసీ కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మాజీ ఎమ్మెల్సీ పి.అశోక్బాబు, ఎన్జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.వి.రమణ, ఆర్టీసీ జోనల్ చైర్మన్లు రెడ్డి అప్పలనాయుడు, ఎస్.సురేష్ రెడ్డి, పి.నాగరాజు, డి.దొర పాల్గొన్నారు.
ఎన్ఎంయూఏ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నిక
నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ అధ్యక్షులుగా వై.శ్రీనివారావు, ప్రధాన కార్యదర్శిగా పి.వి.రమణారెడ్డి ఎన్నికయ్యారు. ఈ మహాసభల్లో భాగంగా ఈ ఎన్నిక నిర్వహించారు. ఇరువురిని ఆయా పదవులకు సభ ఏకగ్రీవంగా ఎన్నిక చేసింది.