Minister Kondapalli Srinivas: పింఛన్ల పంపిణీకి 2,745 కోట్లు విడుదల
ABN , Publish Date - Sep 30 , 2025 | 06:20 AM
ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.2,745.05 కోట్లు విడుదల చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన (సెర్ప్) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
రేపు విజయనగరం జిల్లాలో పాల్గొననున్న సీఎం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడి
అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.2,745.05 కోట్లు విడుదల చేసిందని గ్రామీణ పేదరిక నిర్మూలన (సెర్ప్) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ మొత్తాన్ని అక్టోబరు 1న రాష్ట్రవ్యాప్తంగా 63,50,765 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వీటితోపాటు రాష్ట్రంలో కొత్తగా మంజూరైన 10,578 మంది స్పౌజ్ పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అదనంగా రూ.4.23 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండ లం దత్తి గ్రామంలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కూటమి వచ్చిన తర్వాత పింఛన్ల కింద లబ్ధిదారులకు రూ.45 వేల కోట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి పింఛన్ల పంపిణీ కోసం రూ.32,143 కోట్ల బడ్జెట్ కేటాయించగా.. అక్టోబరు వరకు పింఛన్ల పంపిణీకి రూ. 19,111.85 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు.