డిజిటల్ అరెస్టు పేరుతో రూ.17లక్షలు కాజేశారు!
ABN , Publish Date - May 29 , 2025 | 01:35 AM
‘‘ముంబై క్రైం బ్రాంచ నుంచి కాల్ చేస్తున్నాం. మీరు వాడుతున్న మొబైల్ నంబర్లు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తాం’’ అంటూ బెదిరించి ఒక వ్యక్తి ఖాతాలోని రూ.17 లక్షల సొమ్మును కేటుగాళ్లు కాజేసిన ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.
- మోసపోయిన పటమట అశోక్నగర్కు చెందిన వ్యక్తి
- ఘటనపై ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు
పెనమలూరు, మే28(ఆంధ్రజ్యోతి):
‘‘ముంబై క్రైం బ్రాంచ నుంచి కాల్ చేస్తున్నాం. మీరు వాడుతున్న మొబైల్ నంబర్లు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తాం’’ అంటూ బెదిరించి ఒక వ్యక్తి ఖాతాలోని రూ.17 లక్షల సొమ్మును కేటుగాళ్లు కాజేసిన ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 4వ తేదీన పటమట అశోక్నగర్కు చెందిన ఓ వ్యక్తికి ముంబై క్రైం బ్రాంచి నుంచి ఫోన చేస్తున్నామని ఒక కాల్ వచ్చింది. మీ ఫోన నంబర్లను చట్ట విరుద్ధ కార్యకలాపాలకు వాడుతున్నారని, మిమ్ములను అరెస్టు చేస్తామని బెదిరించారు. 5వ తేదీన మరో వీడియో కాల్లో న్యాయమూర్తి డ్రెస్ వేసుకున్న వ్యక్తి మీరు ఏడు రోజుల పాటు డిజిటల్ కస్టడీలో ఉండాలని ఆదేశించారు. దీంతో భయపడిన సదరు వ్యక్తి కెనరా బ్యాంకులోని తన భార్య పేరిట ఉన్న ఎఫ్డీని రద్దు చేసి రూ. 17 లక్షలను వారు చెప్పిన ఖాతాలో ఆర్టీజీఎస్ ద్వారా బదిలీ చేశాడు. తర్వాత కొన్ని రోజులకు తాను మోసపోయానని గ్రహించి మంగళవారం పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.