Vice President CP Radhakrishnan: వికసిత భారత్ నిర్మాణంలో.. సివిల్ సర్వెంట్ల పాత్ర కీలకం
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:59 AM
వికసిత్ భారత్-2047 నిర్మాణంలో అఖిల భారత సర్వీసు అధికారులైన సివిల్ సర్వెంట్ల పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు.
జీఎస్టీ సంస్కరణలు ఒక మైలురాయి: ఉపరాష్ట్రపతి
‘నాసిన్’లో ట్రైనీ అధికారులనుద్దేశించి ప్రసంగం
మంత్రులు లోకేశ్, సవిత హాజరు
హిందూపురం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): వికసిత్ భారత్-2047 నిర్మాణంలో అఖిల భారత సర్వీసు అధికారులైన సివిల్ సర్వెంట్ల పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం పాలసముద్రం సమీపంలో ఉన్న నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (నాసిన్)ను ఆయన ఆదివారం సందర్శించారు. సివిల్ సర్వీసెస్ ట్రైనీ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. 2024లో ప్రధాని మోదీ నాసిన్ ప్రాంగణాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. భారత కస్టమ్స్, జీఎస్టీ, పరిపాలనా సామర్థ్య నిర్మాణానికి కేంద్రంగా ఇది అవతరించిందన్నారు. అఖిల భారత సర్వీసుల పితామహుడు సర్దార్ పటేల్ 150వ జయంతిని ఈ ఏడాది జరుపుకొంటున్నామని.. సంస్థానాల సమూహంగా ఉన్న దేశాన్ని బలమైన, వికసిత్, ఆత్మనిర్భర్ భారతంగా మార్చడానికి ఆయన దార్శనిక నాయకత్వం పునాది వేసిందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు అమలు చేయడం మైలురాయిగా పేర్కొన్నారు. ఆయన వెంట మంత్రులు లోకేశ్, సవిత, నాసిన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.