ప్రధాని పర్యటనపై సమీక్ష
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:45 PM
దేశ ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన శ్రీశైలం పర్యటనకు రానున్న నేపథ్యంలో మంగళవారం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు.
శ్రీశైలంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు
క్షేత్రస్థాయిలో భద్రతపై పరిశీలన
పరిపాలనా భవనంలో ఏర్పాట్లపై సమీక్ష
శ్రీశైలం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16వ తేదీన శ్రీశైలం పర్యటనకు రానున్న నేపథ్యంలో మంగళవారం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ప్రధాని పర్యటనను దృష్టిలో ఉంచుకుని సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు శ్రీశైలానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి ప్రోగ్రాం స్పెషల్ అధికారి వీరపాండియన, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఈగల్ చీఫ్ ఆకె రవికృష్ణ, డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, గ్రేహౌండ్స్ డీఐజీ బాబూజీ, ప్రకాశం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, సీఐడీ ఎస్పీ ఎస్వీ శ్రీధర్ రావు, నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన, ఐపీఎస్ అధికారి అధిరాజ్సిగ్ రాణా, శ్రీశైలం ఆలయ ఈఓ శ్రీనివాసరావు తదితరులు పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా వారు సున్నిపెంట హెలిప్యాడ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం శ్రీశైలానికి చేరుకుని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి మల్లికార్జునస్వామి ఆలయం ఎదురుగా గంగాధర మండపం వద్దకు చేరుకుని ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లపై కూడా ఆరా తీశారు. ప్రధానమంత్రి సున్నిపెంట హెలీప్యాడ్ వద్ద ల్యాండ్ అయి అక్కడి నుంచి శ్రీశైలానికి రోడ్డుమార్గాన వస్తారు. దీంతో రహదారి వెంబడి భద్రతా ఏర్పాట్లు, రహదారిని పరిశీలించారు. రహదారికి మరమ్మతులు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. తర్వాత శ్రీశైలం దేవస్థానం పరిపాలన భవనంలో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు, ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో నంద్యాల ఏఎస్పీ యుగంధర్ బాబు, ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, సీఐ ప్రసాదరావు, నంద్యాల జిల్లా సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.