Minister Payyavula Keshav: పుస్తకాలు, పెన్నులపై జీఎస్టీ ఎత్తేయండి
ABN , Publish Date - Sep 03 , 2025 | 04:06 AM
పుస్తకాలు, పెన్నులు, నూలు, రంగులపై జీఎస్టీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు. బుధ, గురువారాల్లో ఢిల్లీలో జీఎస్టీ మండలి సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో...
నూలు, రంగులను మినహాయించండి
జీఎస్టీ మండలికి పయ్యావుల ప్రతిపాదనలు
నేడు, రేపు ఢిల్లీలో జీఎస్టీ మండలి సమావేశాలు
అమరావతి, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): పుస్తకాలు, పెన్నులు, నూలు, రంగులపై జీఎస్టీ ఎత్తివేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విజ్ఞప్తి చేశారు. బుధ, గురువారాల్లో ఢిల్లీలో జీఎస్టీ మండలి సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పన్ను శ్లాబుల్లో మార్పులు చేయాలని కోరుతూ జీఎస్టీ మండలి చైర్పర్సన్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఆయన కొన్ని ప్రతిపాదనలతో లేఖ రాశారు. ముఖ్యంగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని, పాదరక్షల రంగంలో ఉన్న ఎంఎస్ఎంఈలకు చేయూతనివ్వాలని, పుస్తకాలు, పెన్నులపై పూర్తిగా పన్ను మినహాయించాలని కోరారు. ‘రాష్ట్రంలో బందర్ పేట చీరలు, ఉప్పాడ జందానీ చీరలు, వెంకటగిరి జరీ చీరలు, మంగళగిరి చేనేత చీరలు, పొందూరు ఖాదీ, కాటన్, ఇతర వస్త్రాలకు ఏపీ ప్రసిద్ధి. రాష్ట్రంలో వస్త్రాల ఉత్పత్తి, వ్యాపారం ద్వారా 5 లక్షల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. వ్యాట్ ఉన్న సమయంలో కాటన్ నూలు, సిల్కు నూలుపై పన్నులు ఉండేవి కాదు. కానీ, ఇప్పుడు కాటన్ నూలుపై 5ు, రంగులు, వాటికి సంబంధించిన రసాయనాలపై 18ు పన్ను అమలవుతోంది. దీంతో ధరలు పెరిగి వ్యాపారం కుదేలవడంతో ఆ రంగంలో ఉపాధి తగ్గిపోయింది. అలాగే, గరిటెలు, స్పూన్లు, పాత్ర లు, వల్కనైజ్డ్ రబ్బర్, ఫ్లేవర్లు కలిపిన పాలు, జున్ను, బేకరీ ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తేయండి’ అని కేశవ్ కోరారు.