Chairman BR Naidu: భూమనను తిరుపతి నుంచి తరిమికొట్టాలి
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:51 AM
తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రతిరోజూ బురదజల్లుతున్న భూమన కరుణాకర్రెడ్డి తిరుపతిలో ఉండేందుకు అర్హుడు కాడని, ఆయనను నగరం నుంచి తరిమికొట్టాలని...
టీటీడీపై బురదజల్లితే ఊరుకునేది లేదు
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరిక
తిరుపతి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రతిరోజూ బురదజల్లుతున్న భూమన కరుణాకర్రెడ్డి తిరుపతిలో ఉండేందుకు అర్హుడు కాడని, ఆయనను నగరం నుంచి తరిమికొట్టాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం సాయంత్రం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన టీటీడీ సభ్యులు పనబాక లక్ష్మి, భానుప్రకాశ్రెడ్డి, తుడా చైర్మన్, టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యుడు డాలర్స్ దివాకర్రెడ్డి, జేఈవో వీరబ్రహ్మంతో కలిసి మీడియాతో మాట్లాడారు. టీటీడీపై జరుగుతున్న విషప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. టీటీడీపై బురదజల్లితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వాస్తవానికి తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా శేషాచలం కొండ కింద ఒబెరాయ్ హోటల్కు స్థలాన్ని కేటాయించింది వైసీపీయేనని గుర్తు చేశారు. స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని 2024 నవంబరు 18న టీటీడీ బోర్డు సమావేశంలో తాము తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించామన్నారు. అయితే, మరోచోట భూమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కానీ, ప్రైవేటు సంస్థలకు టీటీడీ భూములు ధారాదత్తం చేస్తోందని భూమన ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.