Share News

పెద్దాసుపత్రిలో అరుదైన యాంజియోప్లాస్టి

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:08 AM

నంద్యాల జిల్లా మిడ్తూరుకు చెందిన 45 ఏళ్ల చంద్రావతి అనే రోగికి కార్డియాలజి వైద్యులు ఎడమ చేతి రక్తనాళ ధమనానికి సబ్‌క్లావియన యాంజియోప్లాస్టిని కర్నూలు జీజీహెచలో మొట్టమొదటి సారిగా విజయవంతంగా అమర్చారు.

   పెద్దాసుపత్రిలో అరుదైన యాంజియోప్లాస్టి
రోగితో కార్డియాలజి వైద్యులతో హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌

కర్నూలు హాస్పిటల్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా మిడ్తూరుకు చెందిన 45 ఏళ్ల చంద్రావతి అనే రోగికి కార్డియాలజి వైద్యులు ఎడమ చేతి రక్తనాళ ధమనానికి సబ్‌క్లావియన యాంజియోప్లాస్టిని కర్నూలు జీజీహెచలో మొట్టమొదటి సారిగా విజయవంతంగా అమర్చారు. ఎడమచేయి నొప్పితో బాధపడుతూ జూన 27వ తేదీన మహిళ కర్నూలు జీజీహెచలోని కార్డియోథోరాసిక్‌ విభాగానికి వచ్చింది. అక్కడి నుంచి ఈ నెల 11వ తేదీన కార్డియాలజి విభాగంలో అడ్మిషన పొందింది. ఈ నెల 14వ తేదీన కార్డియాలజి విభాగపు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రశాంత, రవికిరణ్‌, లలిత కుమారి, రాజ్‌కుమార్‌ వైద్యబృందం ఎలాంటి కుట్టు, కోత, మత్తు లేకుండా బ్లాక్‌ అయిన ఎడమ చేయి రక్తనాళాన్ని ఓపెన చేసి సబ్‌ క్లావియన యాంజియోప్లాస్టిని విజయవంతంగా నిర్వహించారు. ఈ చికిత్స వల్ల రోగి ఎడమ చేయి రక్తనాళం రక్తప్రవాహం మెరుగైంది. ఈ సందర్బంగా కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెగ్యులర్‌గా గుండెకు స్టంట్స్‌ వేయడం జరుగుతుందని, అయితే చేయి రక్తనాళాలు పెద్దగా ఉంటాయనీ, ఈ స్టంట్‌ను హైదరాబాదు నుంచి తెప్పించడం జరిగిందన్నారు. కర్నూలు జీజీహెచలో మొట్టమొదటిసారిగా ఎన్టీఆర్‌ వైద్యసేవ కింద విజయవంతంగా నిర్వహించినందుకు కార్డియాలజి హెచవోడీ డాక్టర్‌ ఆదిలక్ష్మి వైద్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్‌ డిప్యూటి సూపరింటెండెంట్‌ డి.శ్రీరాములు, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేటర్‌ కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 12:08 AM