Golimi Ramakrishna Vijayadundubhi: సచివాలయ సంఘ ఎన్నికల్లో..రామకృష్ణ విజయదుందుభి
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:36 AM
రాష్ట్ర సచివాలయ సంఘం (అప్సా) అధ్యక్షుడిగా గొలిమి రామకృష్ణ విజయదుందుభి మోగించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కోట్ల రాజేశ్పై 296 ఓట్ల మెజారీటతో విజయం సాధించారు.
అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో గెలుపు
9 పదవుల్లో ఆయన ప్యానెల్కే 7
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సచివాలయ సంఘం (అప్సా) అధ్యక్షుడిగా గొలిమి రామకృష్ణ విజయదుందుభి మోగించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి కోట్ల రాజేశ్పై 296 ఓట్ల మెజారీటతో విజయం సాధించారు. అమరావతి సచివాలయంలో సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో ఆయన ప్యానెల్కు ఉద్యోగుల నుంచి విశేష మద్దతు లభించింది. ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి 1.30 వరకు కొనసాగింది. ఫలితాలు వెల్లడికాగానే సచివాలయ ప్రాంగణంలో ఉద్యోగులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. అప్సా ఎన్నికల్లో మొత్తం 1,159 మంది ఉద్యోగులు ఓటర్లుగా ఉండగా.. 1,105 ఓట్లు పోలయ్యాయి. కార్యవర్గంలో మొత్తం 9 పదవులకు పోటీ జరగగా, ఏడింట రామకృష్ణ ప్యానెల్ విజయదుందుభి మోగించింది. అధ్యక్ష స్థానానికి రామకృష్ణ ప్యానెల్ నుంచి రామకృష్ణ, కోట్ల రాజేశ్ ప్యానెల్ నుంచి రాజేశ్ తలపడ్డారు. ట్రెజరర్గా రామకృష్ణ ప్యానెల్కు చెందిన భాగ్యలక్ష్మి తన ప్రత్యర్థిపై జగదీశ్కుమార్పై గెలుపొందారు. ఉపాధ్యక్షుడిగా పవన్కుమార్ తన ప్రత్యర్థి గోపీ కృష్ణపై 338 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఉపాధ్యక్ష(మహిళ) స్థానం లో లక్ష్మణకుమారి తన ప్రత్యర్థి కవితపై 220 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీ(స్పోర్ట్స్)గా మధుబాబు తన ప్రత్యర్థి సత్యనారాయణపై 333 ఓట్ల మెజారిటీతో గెలిచారు. జాయింట్ సెక్రటరీ(ఆర్గనైజేషన్)గా రాజేంద్ర ప్రకాశ్ తన ప్రత్యర్థిపై నాగూర్ మీరావలిపై 110 ఓట్ల ఆధిక్యంతో.. ఇంకో జాయింట్ సెక్రటరీ (మహిళ)గా సునీత తన ప్రత్యర్థి సాయిలీలపై 53 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తం ఫలితాల్లో రామకృష్ణ ప్యానెల్ 7 పదవుల్లో విజయం సాధించింది. ప్రధాన కార్యదర్శిగా రాజేశ్ ప్యానెల్కు చెందిన నాతా ప్రసాద్ ఆరు ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. అదనపు కార్యదర్శిగా ఇదే ప్యానెల్కు చెందిన లింగారెడ్డి 183 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు.