Share News

Government Schools: పాఠశాలల్లో ప్యూర్‌ ఫెమ్‌ అమలు

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:36 AM

రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీలతో సహా సుమారు 8 వేల మాధ్యమిక పాఠశాలల్లో ప్యూర్‌ ఫెమ్‌ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు....

Government Schools:  పాఠశాలల్లో ప్యూర్‌ ఫెమ్‌ అమలు

  • ‘ప్యూర్‌’ సంస్థతో సమగ్ర శిక్ష ఒప్పందం

అమరావతి, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీలతో సహా సుమారు 8 వేల మాధ్యమిక పాఠశాలల్లో ‘ప్యూర్‌ ఫెమ్‌’ కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. ఈ మేరకు పీపుల్‌ ఫర్‌ అర్బన్‌ అండ్‌ రూరల్‌ ఎడ్యుకేషన్‌ (ప్యూర్‌) సంస్థతో, సమగ్ర శిక్ష అధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈమేరకు శనివారం విజయవాడలోని సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయంలో పూర్‌ సంస్థ వ్యవస్థాపకురాలు, సీఈవో డాక్టర్‌ శైల తల్లూరి, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ‘ప్యూర్‌ ఫెమ్‌’ కార్యక్రమం ద్వారా దాదాపు 8 లక్షల మంది కౌమార బాలికలు లబ్ధి పొందనున్నట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తెలిపారు. 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికలకు రుతుస్రావ పరిశుభ్రత నిర్వహణ, ఆరోగ్యం, శ్రేయస్సు, వ్యక్తిగత భద్రతపై నిర్మాణాత్మక వర్క్‌షాపులు, అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. మధ్యాహ్న భోజన పథకం విభాగం డైరెక్టర్‌ ఆర్‌.ఎ్‌స.గంగా భవాని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Updated Date - Oct 26 , 2025 | 05:36 AM