పబ్లిసిటీ ఫైట్!
ABN , Publish Date - Dec 04 , 2025 | 01:17 AM
డిస్ప్లే డివైజ్ బోర్డుల ఏర్పాటుకు నగర కార్పొరేషన్కు నిర్దేశించిన పాలసీపై సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యాడ్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా బీ1 వంటి యాడ్ ఏజెన్సీలు చెల్లించని ధరలను ఇక్కడ నిర్ణయించారని విమర్శిస్తున్నాయి. న్యూయార్క్ సిటీలో కూడా ఇంత ధరలు లేవని అంటున్నాయి. ఇక్కడ పబ్లిక్ ప్లేస్ ల్యాండ్ రెంట్, చదరపు మీటరుకు నిర్దేశించిన ప్రకటన బోర్డుల ధరలతో తమ దుకాణాలను మూసివేసుకోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నాయి. ఈ పాలసీ ప్రస్తుతం అమల్లో లేకపోయినా.. కౌన్సిల్లో ఆమోదించి ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణను త్వరలో కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని నిర్ణయించాయి.
- డిస్ప్లే డివైజ్ బోర్డుల ఏర్పాటులో కొత్త పాలసీ తెచ్చిన ప్రభుత్వం
- సరికొత్త ధరలను ఆక్షేపిస్తున్న ఎంఎస్ఎంఈ యాడ్ ఏజెన్సీలు
- మంత్రి నారాయణను కలిసి సమస్యను ఏకరువు పెట్టాలని నిర్ణయం
- విజయవాడ వేదికగా.. త్వరలో అన్ని కార్పొరేషన్ల పరిధిలోని యాడ్ ఏజెన్సీల సమావేశం
డిస్ప్లే డివైజ్ బోర్డుల ఏర్పాటుకు నగర కార్పొరేషన్కు నిర్దేశించిన పాలసీపై సూక్ష్మ, చిన్న, మధ్య తరహా యాడ్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మలేషియా, సింగపూర్ దేశాల్లో కూడా బీ1 వంటి యాడ్ ఏజెన్సీలు చెల్లించని ధరలను ఇక్కడ నిర్ణయించారని విమర్శిస్తున్నాయి. న్యూయార్క్ సిటీలో కూడా ఇంత ధరలు లేవని అంటున్నాయి. ఇక్కడ పబ్లిక్ ప్లేస్ ల్యాండ్ రెంట్, చదరపు మీటరుకు నిర్దేశించిన ప్రకటన బోర్డుల ధరలతో తమ దుకాణాలను మూసివేసుకోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నాయి. ఈ పాలసీ ప్రస్తుతం అమల్లో లేకపోయినా.. కౌన్సిల్లో ఆమోదించి ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణను త్వరలో కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని నిర్ణయించాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
డిస్ప్లే డివైజ్ బోర్డు (డీడీబీ)ల పేరుతో ప్రకటనల బోర్డుల నిర్వహణ, పన్ను వసూళ్ల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంఽధించిన బాధ్యతలను పురపాలక శాఖకు అప్పగించింది. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ర్టేషన్ (సీడీఎంఏ) దీనికి సంబంధించి తాము తీసుకురావాలనుకుంటున్న ప్రాథమిక పాలసీని యాడ్ ఏజెన్సీలతో నిర్వహించిన సమావేశంలో వివరించింది. ఏజెన్సీల నుంచి అభ్యంతరాలను కూడా స్వీకరించింది. ఇది రాష్ట్ర స్థాయిలో జరిగిన సమావేశం. ఈ పాలసీకి సంబంధించి ఎంఎస్ఎంఈ యాడ్ ఏజెన్సీలు తమ మనుగడను దృష్టిలో పెట్టుకుని కొన్ని సూచనలు చేశాయి. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో విజయవాడ మునిపిసల్ కార్పొరేషన్ పరిధిలో ఎంతెంత ఫీజులు వసూలు చేయాలన్నది నిర్ణయించటం జరిగింది. తమ సూచనలను సీడీఎంఏ పెడచెవిన పెట్టిందని, ముందు సీడీఎంఏ చెప్పిన విషయాలకు జీవోలో పేర్కొన్న అంశాలకు ఎంతో వ్యత్యాసం ఉందని ఎంఎస్ఎంఈ యాడ్ ఏజెన్సీలు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నాయి. తాజా జీవోలోని కొన్ని అంశాలు అస్పష్టత, గందరగోళానికి తావిచ్చేలా ఉన్నాయని, తమ మనుగడకే ప్రమాదం వాటిల్లేలా ఉందని ఆందోళన చెందుతున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో పబ్లిక్ ప్లేస్ రెంట్, డిస్ప్లే డివైజ్ బోర్డు (డీడీబీ)లు ఏర్పాటుకు సంబంధించి ఎంఎస్ఎంఈ యాడ్ ఏజెన్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
పబ్లిక్ ప్లేస్ రెంట్పై అస్పష్టత
కార్పొరేషన్కు చెందిన పబ్లిక్ ప్లేసుల్లో డిస్ప్లే డివైజ్ బోర్డు (డీడీబీ)లు ఏర్పాటు చేయటానికి యాడ్ ఏజెన్సీలకు సైట్ రెంట్ను ప్రభుత్వం నిర్దేశించింది. ఉత్తర్వుల్లోని 20వ అంశంలో దీనిపై అస్పష్టత నెలకొంది. ప్రకటన బోర్డు ఏర్పాటు చేయటానికి యాడ్ ఏజెన్సీ కనిష్టంగా 100 అడుగుల మేర బోర్డును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంటే 10 /10 బోర్డు అన్నమాట. పబ్లిక్ ప్లేస్కు సంబంధించి రెంట్ను మొదటి సారి అయితే రిజిస్ర్టేషన్ శాఖ నిర్ణయించిన మార్కెట్ విలువ ప్రకారం 10 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఇది అడుగుకా ? స్క్వేర్ మీటర్కా ? అన్నది లేదు. పోనీ స్వ్కేర్ మీటర్ కింద వసూలు చేస్తారనుకుందాం. స్క్వేర్ మీటర్ అంటే 10.76 అడుగులు వస్తుంది. నగరంలో రమేష్ హాస్పిటల్ ప్రాంతంలో మార్కెట్ విలువ గజం రూ.లక్ష అనుకుంటే.. అడుగుకు రూ.10 వేలు పడుతుంది. ఈ లెక్కన రెంట్ విలువ రూ. లక్ష కట్టాల్సి ఉంటుంది. ఎంత కాలానికి ? ఏడాదికా ? మూడేళ్లకా ? అన్నది స్పష్టత లేదు. లీజు కాలం మాత్రం 3 సంవత్సరాలుగా నిర్దేశించటం జరిగింది. సంవత్సరానికి కట్టాలా ? మూడేళ్లకు కట్టాలా? అన్నది మరో సందేహంగా ఉంది. పైన చెప్పుకున్న రూ.లక్ష అద్దె అనేది అసాధారణమైన అద్దె. ఎందుకంటే 10/10 బోర్డుకు యాడ్ ఏజెన్సీ పార్టీ దగ్గర వసూలు చేసుకునే అద్దె రూ. 29 వేలు. పార్టీ నుంచి వసూలు చేసిన దాని కంటే రెండు రెట్లకు పైగా అద్దె విలువ చెల్లించటం అన్నది దారుణమైన విషయం. కాబట్టి ఈ అంశాలపై స్పష్టత ఇవ్వాలి.
అనుమతి ఫీజులు ఆందోళనకరం
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్ఎంఈ) యాడ్ ఏజెన్సీలు ఎక్కువుగా పెట్టగలిగేవి సింగిల్ పిల్లర్ బోర్డులు. వీటికి మూడేళ్ల కాలానికి చదరపు మీటరు రూ.5 వేలు నిర్ణయించారు. మూడేళ్ల కాలానికి అని చెప్పి మళ్లీ ప్రతి ఆర్థిక సంవత్సరానికి 10 శాతం అని మరో నిబంధన పెట్టారు. ఇది ఇంకో గందరగోళం. సంవత్సరానికి 10 శాతం అంటే మూడేళ్లకు చదరపు మీటరు రూ. 5 వేలు ఫీజు ఉండదు. పైమాదిరిగానే చూస్తే 10 / 10 బోర్డుకు 10 చదరపు మీటర్ల లెక్కన చూస్తే ఏడాదికి రూ. 50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లకు రూ.1.50 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ఏడాదికి రూ. 29 వేలు చొప్పున పార్టీ దగ్గర వసూలు చేసే ఎంఎస్ఎంఈ ఏజెన్సీ మూడేళ్లకు రూ. 1.50 లక్షలు ఎలా చెల్లించగలదు. పైన రెంట్ రూ. లక్ష (ఎన్నేళ్లకో స్పష్టత లేదు), దిగువ రూ. 1.50 లక్ష (3 ఏళ్లకు కలిపితే) రూ.2.50 లక్షలు చెల్లించాల్సి వస్తోంది. అదే పార్టీ ద్వారా ఎంఎస్ఎంఈ యాడ్ ఏజెన్సీకి వచ్చే ఆదాయం చూస్తే.. మూడేళ్లకు రూ. 82వేలు మాత్రమే వస్తుంది.