Nellore: మా మూడు మండలాలను నెల్లూరుతోనే ఉంచాలి
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:35 AM
తమను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ 3 మండలాల ప్రజలు చేస్తున్న ఆందోళన తీవ్రమవుతోంది.
మంత్రి ఆనంకు జేఏసీ విజ్ఞప్తి
తిరుపతి జిల్లానే ముద్దంటూ రోడ్డెక్కిన ఓ టీడీపీ వర్గం
నెల్లూరు(వైద్యం), రాపూరు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): తమను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలంటూ 3 మండలాల ప్రజలు చేస్తున్న ఆందోళన తీవ్రమవుతోంది. మంత్రి ఆనం రామనారాయణరెడ్డితోపాటు టీడీపీ ప్రజాప్రతినిధులు పలువురు ప్రజాందోళనకు మద్దతుగా నిలిచారు. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లలోనే ఉంచాలని తిరుపతి జిల్లాలో కలపవద్దంటూ జేఏసీ నేతలు మంత్రి ఆనంకు వినతిపత్రం ఇచ్చారు. ఆయన ఆ పత్రాలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు అందించి ప్రజల విజ్ఞప్తిని వివరించారు. విషయాన్ని ఇప్పటికే సీఎం చంద్రబాబు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. కాగా శుక్రవారం జరిగిన పరిణామాలు ప్రజలను ఉలికిపాటుకు గురిచేశాయి. టీడీపీలోని ఒక వర్గం కార్యకర్తలు, స్థానికులతో కలసి తమను తిరుపతి జిల్లలోనే ఉంచాలంటూ గళమెత్తారు. రాపూరు ప్రధాన కూడలిలో మానవహారంగా ఏర్పడి, ‘నెల్లూరు జిల్లా వద్దు- తిరుపతి జిల్లా ముద్దు’ అంటూ నినాదాలు చేశారు.