Minister Narayana: పట్టణాల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం
ABN , Publish Date - Oct 08 , 2025 | 05:12 AM
మున్సిపాలిటీల్లో ఘన, ద్రవ వ్యర్థాలు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల నిర్వహణ పక్కాగా చేపట్టాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ శాఖ...
అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి
రెండేళ్లలో 90 శాతం ఇళ్లకు తాగునీరు.. జూన్కి టిడ్కో ఇళ్లు
మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్ల వర్క్షాపులో మంత్రి నారాయణ
అమరావతి, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీల్లో ఘన, ద్రవ వ్యర్థాలు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల నిర్వహణ పక్కాగా చేపట్టాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం మున్సిపల్ శాఖ డైరెక్టరేట్లో మున్సిపల్ కమిషనర్లు, ఇంజనీర్లతో నిర్వహించిన వర్క్షాపులో ఆయన మాట్లాడారు. ‘పట్టణాల్లో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా కమిషనర్లు చొరవ తీసుకోవాలి. రాష్ట్రంలో పేరుకుపోయిన 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తను ఇప్పటికే తొలగించాం. మరో 20 లక్షల టన్నులు పోగుపడిన చెత్తను డిసెంబరు నెలాఖరుకు తొలగిస్తాం. కొత్తగా 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటితో రాష్ట్రంలోని మున్సిపాలిటీల డంపింగ్ యార్డ్ రహితంగా మారతాయి. ద్రవ వ్యర్థాల నిర్వహణ అత్యంత కీలకం. ప్రతి రోజూ ఇళ్లలో ఉపయోగించిన నీటితో పాటు వర్షపు నీరు కోసం కాలువల నిర్మాణం చేపడతున్నాం. అమృత్ పథకం-2 ద్వారా మున్సిపాలిటీల్లో రాబోయే రెండేళ్లలో 90 శాతం ఇళ్లకు తాగునీరు అందించేలా ముందుకెళ్తున్నాం. పూర్తయిన టిడ్కో ఇళ్లను ప్రతి శనివారం లబ్ధిదారులకు కేటాయించాలి. వచ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేయాలి’ అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. బుధ, గురువారాల్లోనూ ఈ వర్క్షాప్ కొనసాగనుంది.