Kurnool Visit: ప్రధాని కర్నూలు పర్యటన ఖరారు
ABN , Publish Date - Oct 12 , 2025 | 06:16 AM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. 16న కర్నూలులో జరిగే సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ విజయోత్సవ సభకు ప్రధాని హాజరవుతున్నారు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు రాష్ట్రంలోనే మోదీ
గంటన్నరపాటు జరగనున్న జీఎస్టీ విజయోత్సవ సభ
గంటపాటు శ్రీశైలం ఆలయంలో మోదీ పూజలు
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారైంది. 16న కర్నూలులో జరిగే ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ విజయోత్సవ సభకు ప్రధాని హాజరవుతున్నారు. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రధానితోపాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రులు లోకేశ్ తదితరులు పాల్గొంటారు. 16వ తేదీ ఉదయం 10.20కు ఢిల్లీ నుంచి కర్నూలు విమానాశ్రయానికి ప్రధాని చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో సుండిపెంట చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11.45కు శ్రీశైలం చేరుకుని, భ్రమరాంభ మల్లికార్జునస్వామి ఆలయంలో 50 నిమిషాలపాటు పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30కు కర్నూలు చెంతనే ఉన్న నన్నూరు గ్రామానికి చేరుకుని జీఎస్టీ విజయోత్సవ సభలో పాల్గొంటారు. అక్కడే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, పూర్తయిన ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. సభ ముగిసిన తర్వాత 4.45కి తిరిగి ఢిల్లీ వెళ్తారు.